ప్రజాస్వామ్యమా.. పోలీసుల రాజ్యమా?.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, పోలీసుల రాజ్యం నడుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Update: 2023-08-10 16:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, పోలీసుల రాజ్యం నడుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గ్రూప్ 2 అభ్యర్ధులకు మద్ధతుగా ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం తగదని ఆయన ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, కానీ కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులపై వివక్ష చూపుతుందన్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికితే ప్రజల పక్షాన ఆలోచించాల్సిన పాలకులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నియంతల ప్రవర్తిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్ ను మఫ్టీ పోలీసులు తన కోచింగ్ సెంటర్ లో అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను కూడా అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​ కు తరలించినట్లు చెప్పారు. విద్యార్థుల పక్షాన ప్రజాస్వామిక పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టులు చేయడం దారుణమన్నారు. వెంటనే వారిని విడుదల చేసి, గ్రూప్ 2 విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా తొమ్మిదేళ్లు నీరో లాగా కేసీఆర్ వ్యవహరించారన్నారు. ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్థులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం అగ్ని ‘పరీక్ష’పెడుతుందన్నారు.గ్రూప్-2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తోన్న డిమాండ్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News