సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై కేసీఆర్ కు లేఖ
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి సమ్మెను విరమింపచేయాలని సీపీఐ
దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి సమ్మెను విరమింపచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. గత రెండు వారాలకు పైగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులు న్యాయబద్ధమైన తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారని తెలిపారు. దాదాపు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో ఉండడం మూలంగా బొగ్గు ఉత్పత్తి పై తీవ్రమైన ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
సివిల్ సివిక్, అన్వేషణ విభాగం, బ్లాస్టింగ్, బొగ్గు రవాణా, హాస్పటల్, కన్వెయన్స్ డ్రైవర్స్, సెక్యూరిటీ తదితర 40 విభాగాల్లో సమ్మె కొనసాగుతున్నదని తెలిపారు. దీంతో సంస్థ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందని, సమాన పనికి సమానవేతనం ప్రకారం రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు కార్మికులు వేతనాలు ఇవ్వాలని, గని ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు కోటీ రూపాయల ఎక్స్గ్రేషియా, బోనస్, సింగరేణి వైద్యశాలల్లో కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కల్పించాలనే వారి డిమాండ్లను నెరవేర్చలన్నారు. వీటన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించ కపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని వివరించారు.