సారలమ్మ గుడి కూల్చివేత.. అటవీ అధికారులపై గిరిజనుల ఫైర్
ములుగు జిల్లా అటవీ అధికారుల తీరు వివాదాస్పదమైంది.
దిశ ఏటూరునాగారం : ములుగు జిల్లా అటవీ అధికారుల తీరు వివాదాస్పదమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలో శనివారం జాతీయ రహదారిపై ఆదివాసీలు భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గత 70 సంవత్సరాలుగా వంశపారం పర్యంగా తాము సారలమ్మలను కోలుచుకుంటున్నామని తెలిపారు. తమ ఇలవేల్పు అయిన సారలమ్మ గద్దెలను అటవీశాఖ అధికారులు కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తాడ్వాయి మండలం కాటాపురం గ్రామం వెళ్లె మార్గంలో సారలమ్మ గుడి గద్దె ఉంది. ప్రతి జాతరకు ముందు అనవాయితీగా అమ్మవారికి కొత్త గుడిసే వేసి పూజలు నిర్వహించి అమ్మవార్లను కోలుచుకుంటామని ఆదివాసీలు తెలిపారు.
అయితే ఈ క్రమంలోనే ఈ ఏడాది సైతం అమ్మ వారి గుడిసె వద్ద గద్దెను మూడు రోజుల క్రితం నిర్మాణం చేపట్టామని ఆదివాసీలు తెలిపారు. అయితే అటవీ శాఖ సిబ్బంది వచ్చి ఇక్కడ గద్దె కట్టకూడదని అడ్డుపడ్డారని తెలిపారు. శనివారం వచ్చి చూసే సమయానికి అటవీశాఖ అధికారులు సారలమ్మ గద్దెను కూల్చి వేశారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని అదివాసీలు పెద్ద ఎత్తున తాడ్వాయి జాతీయ రహదారీపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో వాహనాల రాకపోలకు కాసేపు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ విషయమై 'దిశ' మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గరావును ఫోన్ ద్వారా సంప్రందిచాగా అటవీశాఖ అదికారులు కట్టిన గద్దెను కూల్చివేసారని ఎట్టి పరిస్థితుల్లో పూజా కార్యక్రమాలన్నియధావిధిగా జరుగుతాయన్నారు.