కష్టకాలంలో అండగా నిలబడలేదని ఎన్నికల్లో వీధి వ్యాపారి పోటీ.. ఆ స్థానంలో ఆసక్తిగా మారిన ఇండిపెండెంట్ అభ్యర్థి

ప్రజాస్వామ్యంలో తమ నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది.

Update: 2024-05-06 08:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రజాస్వామ్యంలో తమ నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. అయితే ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో పంథాను ఎంచుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి తన నిరసనను వ్యక్తం చేయడానికి ఎన్నికలను ఎంచుకున్నాడు. తన కుటుంబానికి జీవనోపాధిగా ఉన్న దుకాణాన్ని బలవంతంగా మూసివేయడంతో లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగాడు ఓ వీధి వ్యాపారి. ఈ వ్యవహారం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. చిరిపి రెడ్డి రమేష్ అనే వ్యక్తి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. అతడు చైతన్యపురి ప్రధాన రహదారి వద్ద రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తన దుకాణాన్ని బలవంతంగా మూసివేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలన్నర కాలంలో తనలాంటి దాదాపు వెయ్యి మంది వీధి వ్యాపారాలు జీవనోపాధిని కోల్పోయారని, తనలా ఇబ్బందులు పడుతున్న వారికి మద్ధతు ఇవ్వడంలో విఫలమైన రాజకీయ నాయకులపై అసంతృప్తితో రమేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజిగిరి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయగా అతని నామినేషన్ ఆమోదం పొందింది. ప్రస్తుతం ఆయన తుది పోటీదారుల జాబితాలో ఉన్నారు. కాగా మల్కాజిగిరి స్థానానికి మొత్తం 117 నామినేషన్లు దాఖలు కాగా అందులో 46 ఆమోదం పొందాయి. 115 తిరస్కరించబడ్డాయి. 16 మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోగా తుదిపోటీలో 22 మంది ఉన్నట్లు ఈసీఐ తన వెబ్ సైట్ లో పేర్కొంది.

Tags:    

Similar News