Varla Ramaiah Letter: ఆ జీవో ప్రమాదకరం

చీకటి జీవో నం.1 ను వెంటనే వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. ......

Update: 2023-01-05 10:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చీకటి జీవో నం.1 ను వెంటనే వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలు చూపి చీకటి జీవో నం.1 విడుదల చేయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని లేఖలో పేర్కొన్నారు. జీ.వో నం.1 ఆర్టికల్ – 19 ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్చగా సంచరించే హక్కుకు భంగం కలిగిస్తుందన్నారు. టీడీపీని కట్టడి చేయడమే జీవో నెం.1 ఉద్దేశంగా కనిపిస్తుందని లేఖలో వ్యాఖ్యానించారు. చీకటి జీవో ద్వారా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నట్లుగా కనిపిస్తోందని మండిపడ్డారు.

'1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీ సమయంలో కూడా ఈ రకంగా ఇండియన్ పోలీస్ యాక్టును దుర్వినియోగం చేయలేదు. బ్రిటీషు పాలనలో 1930లో జాతిపిత మహాత్మాగాంధీ దండి యాత్ర చేపట్టినప్పుడు కూడా బ్రీటీషు వారు ఆయనను అడ్డుకోలేదు. కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం అధికారపార్టీ స్లీపర్ సెల్స్ అని అనుమానిస్తుంటే ఎందుకు విచారణ చేయరు?. జీవో నం. 1 విడుదలైన తర్వాత జనవరి 3 న రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి, విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎలా భారీ రోడ్ షోలు నిర్వహించారు?. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కుప్పం మీటింగ్‌కు పోలీసులు ఎందుకు అడ్డంకులు సృష్టించారు?. మీటింగ్‌కు వచ్చిన అమాయక ప్రజలపై, మహిళలపై పోలీసులు ఎందుకు లాఠీఛార్జీ చేశారు?. చంద్రబాబు నాయుడు ప్రజలతో ముఖాముఖి కోసం గ్రామంలో ఏర్పాటు చేసిన స్టేజ్‌ను కూడా పోలీసులు ఎందుకు తొలగించారు?. కుప్పంలో పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ కలుగజేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులు క్షమాపణలు చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. అలాగే కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాటపై అధికార పార్టీ గూండాల కుట్ర కోణం దాగుందేమోనన్న కోణంలో విచారణ చేయాలని వర్ల రామయ్య లేఖలో విజ్ఞప్తి చేశారు.


Similar News