భారత్ బంద్.. వర్షాన్ని లెక్కచేయకుండా అఖిలపక్ష నేతల నిరసన..

by  |
భారత్ బంద్.. వర్షాన్ని లెక్కచేయకుండా అఖిలపక్ష నేతల నిరసన..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం భారత్ బంద్‌కు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా అఖిలపక్ష నేతలు భారత్ బంద్ కోసం ఉదయం నుంచే నిరసనలకు దిగారు. భారత్ బంద్‌లో భాగంగా బస్టాండ్ వద్ద అఖిలపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు.. సోమవారం ఉదయం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ ఎదుట నిరసన తెలిపారు.

డిపో నుంచి బస్‌లు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష నేతలను పోలీస్‌లు అరెస్ట్ చేసి నగరంలోని 4వటౌన్‌కు తరలించారు. ఈ సందర్బంగా బస్టాండ్ వద్ద బంద్‌లో పాల్గొన్న అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మానాల మోహన్ రెడ్డి, ప్రభాకర్, రమేష్ బాబులు మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారుతాయని అన్నారు.

దేశవ్యాప్తంగా రైతులు ఈ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం మాత్రం కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తూ.. చట్టాల అమలుకు చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ విజయవంతం అయిందనీ.. చట్టాలను మార్చాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు వ్యతిరేక చట్టాల అమలులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటేనని విమర్శించారు. ప్రజలందరూ.. టీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనన్న విషయం గమనించాలని కోరారు. రైతుల పట్ల బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు ఉన్న చిత్త శుద్ధిని ఎండగడతామని అన్నారు. కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, ఎల్లారెడ్డి, బీమ్ గల్ బస్టాండ్‌ల వద్ద అఖిలపక్ష నేతలు నిరసనకు దిగారు.


Next Story