INTER EXAMS : రేపటి నుంచే పరీక్షలు.. 70 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

by  |
cbsc--exams
X

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వాహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా రెండో దశ ఉధృతంగా ఉన్న కారణంతో రెండో సంవత్సరంలోకి ప్రమోట్ అయిన విద్యార్థులకు, ఈ నెల 25 నుంచి మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలు కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 70 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 16,455 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 14,535 మంది జనరల్, 1,920 మంది ఓకేషనల్ కేటగిరికి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షలు నవంబర్ 3 వరకు జరగనున్నాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటించారు. అత్యంత పకడ్బందీగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గంట ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పరీక్షలు జరుగుతున్న పరిసరాల్లో 144వ సెక్షన్ విధించి, ఆ ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసి వేయించేలా సంబంధిత అధికార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్విజిలేటర్ల కొరత ఉన్న కేంద్రాల్లో పాఠశాల విద్యా శాఖ నుంచి సిబ్బందిని కేటాయించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రంలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తతో పాటు ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు.

విద్యార్థులు కూడా విధిగా కరోనా నిబంధనలు పాటిస్తూ సానిటైజర్, మాస్కు ధరించి కేంద్రాలకు హాజరుకావాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల మూలంగా రెండేళ్లుగా పరీక్షలకు దూరమైన విద్యార్థుల్లో మానసిక సమస్యలు దూరం చేసేందుకు, ఇంటర్బోర్డు ఆధ్వర్యంలో ఈసారి ఏడుగురు మానసిక నిపుణులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఫోన్ చేసి పరీక్షల భయం ఒత్తిడి తొలగించుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి tsbiem యాప్, tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు నేరుగా డౌన్లోడ్ చేసుకుని, ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు.



Next Story

Most Viewed