కరోనా నియంత్రణ కోసం భారత్‌కు ఏడీబీ ఆర్థిక సాయం

by  |
కరోనా నియంత్రణ కోసం భారత్‌కు ఏడీబీ ఆర్థిక సాయం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారితో సమర్థవంతంగా పోరాడేందుకు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) భారత్‌కు 1.5 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో సుమారు రూ. 11 వేల కోట్లు) ఆర్థిక సాయాన్ని అందించినట్టు మంగళవారం ప్రకటించింది. కరోనాను నియంత్రించేందుకు గతేడాది ఏడీబీ 26 దేశాలకు 20 బిలియన్ డాలర్ల(రూ. 1.5 లక్షల కోట్లు) ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయా దేశాలకు 16.1 బిలియన్ డాలర్లు(రూ. 1.20 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగానే భారత్‌కు ఈ ఏడాది చివరి నాటికి కేటాయించిన మొత్తాన్ని అందించనున్నట్టు ఏడీబీ ప్రతినిధులు వెల్లడించారు.

ఇదే సమయంలో దేశీయంగా కరోనా తీవ్రత దారుణంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కూడా భారత్‌కు సాయమందించనున్నట్టు ప్రకటించింది. క్షేత్రస్థాయిలో కరోనాను ఎదుర్కొనేందుకు జరిగే కార్యక్రమాలకు విరాళాల ద్వారా అవసరమైన సాయం అందించనున్నట్టు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతున్న క్రమంలో డాక్టర్లు, కార్మికులు, యాపిల్ కుటుంబంతో పాటు మహమ్మారితో పోరాడే ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నాం. క్షేత్రస్థాయిలో జరిగే కార్యక్రమాలకు యాపిల్‌ను విరాళం అందించనున్నట్టు టిమ్ కుక్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఇతర వివరాల గురించి కంపెనీ నుంచి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, దేశీయంగా కరోనా విజృంభణకు స్పందంగా భారత సంతతికి చెందిన టెక్ దిగ్గజ కంపెనీ సీఈవోలు కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ. 135 కోట్ల విరాళాన్ని ప్రకటించగా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆక్సిజన్ కాన్సంట్రేషన్‌ల కొనుగోలుకు సాయాన్ని ప్రకటించారు.


Next Story

Most Viewed