రాహుల్ గాంధీ ఉన్నంతకాలం మాకు ఢోకా లేదు: కిషన్ రెడ్డి ధీమా

by GSrikanth |
రాహుల్ గాంధీ ఉన్నంతకాలం మాకు ఢోకా లేదు: కిషన్ రెడ్డి ధీమా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీ ఎలాగూ ప్రధాని అవ్వలేడనేది ఆయనకు అర్థమైందని, అందుకే ఆయన పెళ్లి చేసుకుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు చేసుకోవాలి తప్పదు కదా అంటూ ఆయన పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు తమకు ఢోకాలేదన్నారు. ఆయన ప్రసంగం చేసిన ప్రతి చోటా తమకు అనుకూలంగా ఉంటుందని ఆయన రాహుల్ కు చురకలంటించారు. ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. మాట్లాడిన ప్రతిసారి మోడీకి చాలెంజ్ చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకుడికే దిక్కు లేదని, అలాంటిది ఆయనది మోడీకి సవాల్ చేసే స్థాయి ఉందా? అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్, రాహూల్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు వారి మాటలను పట్టించుకోలేదన్నారు. కనీసం వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా పట్టించుకోలేదన్నారు.

రేవంత్ వ్యాఖ్యలపై ఎవరికీ విశ్వాసం లేదని విమర్శనాస్త్రాలు సంధించారు. డబ్బులు ఖర్చు పెట్టి బీజేపీపై బురద చల్లే ప్రచారాలు చేసినంత మాత్రాన పెద్ద నాయకులు కాలేరంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మాటలు తమకు కూడా చాలా వస్తాయని, ఆయన ఇచ్చిన గ్యారెంటీ లు అమలు చేయకుండా మాటలు చెప్పడం ఆయనకే చెల్లిందంటూ విరుచుకుపడ్డారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఆ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా తన పార్లమెంట్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఇకపోతే బీఆర్ఎస్ కు చాలాచోట్లా ఏజెంట్లు లేరని మండిపడ్డారు. ఉన్నచోట ఏజెన్సీ వాళ్ళను ఏజెంట్ లాగా పెట్టారన్నారు. చాలా చోట్ల కాంగ్రెస్ కోసం మజ్లిస్ కార్యకర్తలు పనిచేశారని కిషన్ రెడ్డి అన్నారు. అర్బన్ ఓట్లను సంస్కరించాల్సిన అవసరముందని కిషన్ రెడ్డి అన్నారు. చనిపోయిన వారి లిస్ట్ ను మునిసిపాల్ అధికారులు తొలగించడం లేదని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో ఒక్క కాలనీ ఓట్లు మొత్తం అకారణంగా తొలగించారని ఫైరయ్యారు.

Next Story

Most Viewed