జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు!

by Disha Web Desk 2 |
జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారు అయినట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్టు ఆశించిన జితేందర్ రెడ్డికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి జితేందర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. చర్చలు సఫలం కావడంతో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖతను వ్యక్తం చేసినట్లు తెలిసింది.

చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల నుండి జితేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ నియోజకవర్గాలలోనూ అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో జితేందర్ రెడ్డికి ఢిల్లీ స్థాయిలోనే ప్రత్యేక హోదాను కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి డాక్టర్ మల్లు రవి ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ స్థానంలో జితేందర్ రెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా రెండు మూడు రోజులలో పూర్తికానున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed