గెలిచిన ఎమ్మెల్యేలంతా మనోతోనే ఉంటారా?.. ఆరా తీస్తున్న అధినేత

by Disha Web Desk 2 |
గెలిచిన ఎమ్మెల్యేలంతా మనోతోనే ఉంటారా?.. ఆరా తీస్తున్న అధినేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని పార్టీలకు గ్రేటర్ కీలకంగా మారింది. మూడు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మెజార్టీ డివిజన్లు కైవసం చేసుకొని పట్టు సాధించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, నేతలు కారు దిగుతుండటంతో పార్టీ బలాబలాలపై అధినేత ఆరా తీస్తున్నారు.

పట్టున్నా గెలుపు డౌటే

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు గ్రేటర్‌పై ఫోకస్ పెట్టాయి. నాలుగు పార్లమెంటు స్థానాలు సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్ స్థానాలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ స్థానాన్ని అన్ని పార్టీలు పెద్దగా లెక్కల్లోకి తీసుకోవు. మిగిలిన మూడుస్థానాల్లో పాగా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే ఇందులో సికింద్రాబాద్ బీజేపీ, చేవేళ్ల బీఆర్ఎస్, మల్కాజిగిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు. వీటిలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ఎంఐఎం 7, బీజేపీ ఒక స్థానం కాగా, మిగిలిన 16 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. శనివారం మరో రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హస్తం గూటికి చేరుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అకాల మృతిచెందగా ఉప ఎన్నిక జరుగుతుంది. దీంతో బీఆర్ఎస్ బలం 16 నుంచి 13కు పడిపోయింది. వీరిలో లోక్‌సభ ఎన్నికల నాటికి ఎంతమంది పార్టీలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది.

సహకరిస్తారా?

బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాలను కోల్పోయింది. ఇప్పుడు పార్టీ బలంగానే ఉంది. పూర్తిస్థాయి మద్దతు ఇస్తారా? లేకుంటే లోపాయికారిగా ఇతర పార్టీలకు సహకరిస్తారా అనేది అనేది హాట్ టాపిక్‌గా మారింది. అధికారపార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 58 డివిజన్లలో బీఆర్ఎస్ విజయం సాధించింది. మేయర్ పీఠాన్ని సైతం కేవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న రాజకీయ మార్పులతో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, మరో 10 మంది చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

లోపించిన సమన్వయం

ఎమ్మెల్యేలు చెబితే కార్పొరేటర్లు వినే పరిస్థితి లేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలు సహకరించలేదని, ఎమ్మెల్యే ఎన్నికల్లో కార్పొరేటర్లు సహకరించలేదని ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు నేతల మధ్య సమన్వయలోపం ఉందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో గెలుపుపై పార్టీకి గుబులు పట్టుకుంది.

Next Story

Most Viewed