ఎస్ఐని ట్రాక్టర్‌తో గుద్ది చంపిన డ్రైవర్.. హోంగార్డులపైనా హత్యాయత్నం

by Disha Web Desk |
ఎస్ఐని ట్రాక్టర్‌తో గుద్ది చంపిన డ్రైవర్.. హోంగార్డులపైనా హత్యాయత్నం
X

జముయి: బీహార్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రాష్ట్రంలోని జముయి జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్నందుకు ఏకంగా ఓ పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్‌ని చంపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోంగార్డు సహా ఇద్దరు వ్యక్తులు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. జముయిలోని గర్హి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాత్ రంజన్ మంగళవారం ఉదయం పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. మహులియా తాండ్ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని సమాచారం అందుకున్న ప్రభాత్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు రాజేష్ కుమార్‌ను వెంట తీసుకొని వెళ్లారు. అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అడ్డగించి, సీజ్ చేసే క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ ప్రభాత్ రంజన్‌తో పాటు హోంగార్డును పలుమార్లు గుద్దాడు. మిగతా పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేశారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలో ఎస్ఐ మరణించగా, హోంగార్డు చికిత్స పొందుతున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.

విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన ఆసుపత్రిలో హోంగార్డును పరామర్శించి, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఘటన గురించి తెలుసుకున్న బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదని, గతంలోనూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో జరిగాయని చెప్పారు. అయితే, ఎస్ఐ ప్రభాత్ రంజన్ ఘటనలో నిందితులకు చట్టప్రకారం శిక్ష పడుతుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.


Next Story

Most Viewed