టీమిండియా గెలవాలంటే ఆ పని చేయాల్సిందే..!

by  |
టీమిండియా గెలవాలంటే ఆ పని చేయాల్సిందే..!
X

దిశ, స్పోర్ట్స్ : ‘ఇండియాలో టాస్ గెలిస్తే.. ఏకంగా వరల్డ్ కప్ గెలిచెయ్యొచ్చు’ అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్ వ్యాఖ్యానించాడు. అహ్మదాబాద్‌లో జరిగిన మూడు టీ20లను పరిశీలిస్తే వాన్ వ్యాఖ్యలు నిజమేనని అనుమానం వస్తుంది. టాస్ గెలిచిన జట్టే మ్యాచ్‌లు గెలిచింది. కెప్టెన్లు ఏం ఊహిస్తున్నారో.. పిచ్ అలాగే స్పందిస్తున్నది. ప్రత్యర్థి జట్టు టాస్ ఓడిపోగానే సగం మ్యాచ్ ఓడిపోయినట్లు భావిస్తున్నారు. టాసే కీలకం అయితే ఇక మ్యాచ్ ఆడటం ఎందుకు అని అభిమానులు కూడా అంటున్నారు.

కానీ, సరిగ్గా గమనిస్తే.. టాస్ కాదు కీలకం ఆటగాళ్ల వైఫల్యాలే కొంప ముంచుతున్నట్లు స్పష్టంగా అర్దమవుతున్నది. భారత జట్టు ఓడిన రెండు మ్యాచ్‌లలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడం చూశాము. కేఎల్ రాహుల్ వరుసగా 1, 0, 0 పరుగులకు అవుటయ్యాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో ఇండియా తరఫున టాప్ ర్యాంకులో ఉన్న ఆటగాడు అతడే. ఐపీఎల్‌ జరిగిన స్లో పిచ్‌లపై కూడా అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో చతికిలపడ్డాడు. ఒక్క రాహుల్ అనే కాదు.. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదు. కీలకమైన 4వ టీ20లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో పాటు తప్పక గెలవాలి. లేకపోతే సిరీస్ ఇంగ్లాండ్ వశం కాక తప్పదు.

టాస్‌ను మర్చిపోవాల్సిందే..

టీమ్ ఇండియా టాస్‌పై ఆశలు పెట్టుకోవడం మానేయాల్సిందే. గురువారం ఆడబోయేది కూడా ఎర్రమట్టి పిచ్‌మీదే. ఇది పేసర్లకు అనుకూలించడంతో పాటు స్పిన్నర్లు కూడా బంతి టర్న్ చేయడానికి ఉపయోగపడుతున్నది. భారత జట్టు టాపర్ ఆర్డర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆడాల్సిందే. కేఎల్ రాహుల్ విఫలమైనా అతడిని జట్టు నుంచి తప్పించబోమని కోహ్లీ మూడో మ్యాచ్ అనంతరం చెప్పాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా రాహుల్‌కు మద్దతు ఇచ్చాడు. దీంతో నాలుగో మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయమే.

ప్రీ డిటర్మైండ్ షాట్లకు వెళ్లకుండా తమ సహజ శైలిలో ఆడితే వీరిద్దరే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ అనుభవం తక్కువగా ఉన్న ఇషాన్ కిషన్ నుంచి ఇప్పుడే భారీ ఇన్నింగ్స్‌లు ఆశించడం కష్టం. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత విఫలమయ్యాడు. ఈ సారి తప్పకుండా నిలవాల్సిన పరిస్థితి. హార్దిక్ పాండ్యా ఇంకా హిట్టింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. శార్దుల్ ఠాకూర్ బదులు నటరాజన్ లేదా నవదీప్ సైనీని తీసుకునే అవకాశం ఉన్నది. వీరిద్దరూ టీ20 ఫార్మాట్‌లో మంచి రికార్డులు కలిగి ఉన్నారు. సూర్యకుమార్ మరోసారి బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. టాస్ ఎవరు గెలిచినా.. భారత జట్టు మాత్రం ఇంగ్లాండ్ మాదిరిగానే ఎటాకింగ్ గేమ్ ఆడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎలాంటి మార్పులు లేకుండానే..

వరల్డ్ నెంబర్ 1 టీ20 జట్టు ఇంగ్లాండ్ ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ముందంజలో ఉన్నది. టీ20 ఫార్మాట్‌కు తగిన ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు. వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మాన్ తమ దూకుడును మాత్రం ఆపడం లేదు. జేసన్ రాయ్, జాస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో వంటి బ్యాట్స్‌మెన్ ఆ జట్టుకు పెద్ద బలం. మరోవైపు ఇంగ్లాండ్ పేసర్లు సరైన లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నారు. జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మాన్‌కు అస్సలు అవకాశం ఇవ్వడం లేదు. వీరికి తోడు బెన్ స్టోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ కూడా వికెట్లు పడగొట్టడంలో విజయం సాధిస్తున్నారు. ఒక బౌలర్‌ను లక్ష్యంగా చేసుకొని టీమ్ ఇండియా బ్యాటింగ్ చేస్తే తప్పకుండా పై చేయి సాధించే అవకాశం ఉన్నది. మూడో టీ20 ఆడిన జట్టుతోనే ఇంగ్లాంగ్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

తుది జట్ల అంచనా

ఇండియా : కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, నవదీప్ సైనీ/టి. నటరాజన్

ఇంగ్లాండ్ : జాస్ బట్లర్, జేసన్ రాయ్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, సామ్ కర్రన్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్



Next Story

Most Viewed