కామారెడ్డి, బోధన్‌లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్

by  |

దిశ, నిజామాబాద్:
కామారెడ్డి పట్టణం రాంమందిర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కొవిడ్-19 లక్షణాలు ఉండటంతో వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి పాజిటివ్ వచ్చిందని కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.వివరాల్లోకివెళితే..ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన ఒక విందుకు కామారెడ్డిలోని రాంమందిరం ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హాజరయ్యారు. అయితే, మెదక్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఆ విందులో పాల్గొన్న ఆరుగురికి పరీక్షలు చేసి హోం క్వారంటైన్‌కు తరలించారు. అందులో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండగా, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. సంబంధిత వ్యక్తిని వెంటనే హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా, కామారెడ్డిలో ఇప్పటి వరకు ఏడుగురికి కరోనా సోకినట్టు అధికార వర్గాల సమాచారం.

బోధన్‌లో కరోనా పాజిటివ్..

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన ఓ వివాహితకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టు గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు నిమ్స్ వైద్యాధికారులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. అయితే, బుధవారం ఆర్మూర్ పట్టణంలో బట్టల వ్యాపారికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో నేటివరకు 14 పాజిటివ్ కేసులు నమోదవగా, 9 మంది కోలుకున్నారు.

Next Story

Most Viewed