యూపీలో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

by  |
యూపీలో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 13 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. బాలికను దుండగులు చెరుకుతోటలోకి లాక్కెళ్లి రేప్ చేశారు. కళ్లు పెరికేశారు. నాలుక చీల్చేశారు. అత్యాచారం అనంతరం చున్నీతో ఉరిపెట్టి కౄరంగా చంపేశారు. ఈ ఘటన నేపాల్ సరిహద్దులోని ఇషానగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఆ బాలిక తండ్రి వివరాల ప్రకారం.. లఖింపూర్ ఖేరీ జిల్లా పకరియా గ్రామంలోని ఇంటి నుంచి బాలిక శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు బయటికెళ్లింది. కానీ, సాయంత్రమైనా తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబీకులు ఆమె కోసం అన్ని చోట్లా గాలించారు. ఈ క్రమంలో ఓ చెరుకు తోట సమీపంలో అనుమానాస్పద గుర్తులు కనిపించాయి. అనంతరం ఆ చెరుకు తోటలో గాలింపు మొదలెట్టగా ఆమె విగత జీవై కనిపించింది. కళ్లు బయటికొచ్చి, తెగిన నాలుక, మెడకు ఉరిపెట్టిన చున్నీతో అత్యంత దయనీయస్థితిలో కనిపించడంతో కుటుంబీకులు ఘొల్లుమన్నారు. గ్రామంలో తమకు ఎవరితో శత్రుత్వం లేదని, తమ కూతురికే ఇలా ఎందుకు జరిగిందో తెలియదని బాలిక తండ్రి వాపోయాడు.

పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్టు తేలిందని లఖింపూర్ ఖేరీ ఎస్పీ సతేంద్ర కుమార్ వెల్లడించారు. ఉరితో ప్రాణాలొదిలినట్టూ ఈ నివేదిక వివరిస్తున్నదని వివరించిన ఎస్పీ, ఆమె కళ్లు పెరికివేయలేదని, నాలుకనూ చీల్చలేదని తెలిపారు. చెరుకు ఆకుల గీసుకుపోవడం వల్ల బాలిక కళ్ల వద్ద గాయాలై ఉండొచ్చని తెలిపారు. ఇద్దరు నిందితులపై హత్య, అత్యాచారం కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు. జాతీయ భద్రతా చట్టం అభియోగాలు మోపనున్నట్టు పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇందులో బాలిక మృతదేహం లభించిన చెరుకు తోట యజమానీ ఉన్నారు. కాగా, బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని కుటుంబీకులు ఆరోపించారు.

దోషులను కఠినంగా శిక్షించాలి: బీఎస్పీ

లఖింపూర్ ఖేరీ పకరియా గ్రామానికి చెందిన దళిత బాలికపై హత్యాచార ఘటన అత్యంత దుఖదాయకమని, సిగ్గుచేటని బీఎస్పీ చీఫ్ మాయావతి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో సమాజ్‌వాదీ హయాం, బీజేపీ పాలనకు తేడా ఏముందని ప్రశ్నించారు. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, బీజేపీ పాలనలో దళితులపై దాడులు పరాకాష్టకు చేరాయని, చట్టంపై భయం లేకుండా లఖింపూర్ ఖేరీ దళిత బాలికపై హత్యాచారం చేశారని, ఇది ఆటవిక పాలన కాకుంటే మరేంటని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రశ్నించారు. దళిత బిడ్డలకు రక్షణ లేదని, దళితుల ఇళ్లూ భద్రంగా లేవని తెలిపారు. అన్ని వైపులా భయానక వాతావరణమే నెలకొని ఉన్నదని, రాష్ట్రీ సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed