బిగ్ బ్రేకింగ్.. హెలికాప్టర్ ప్రమాదంలో 11 మంది దుర్మరణం

by  |
బిగ్ బ్రేకింగ్.. హెలికాప్టర్ ప్రమాదంలో 11 మంది దుర్మరణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోయంబత్తూరు-కూనూరు మార్గంలో కాట్టేరి నంజప్పసత్రం సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిన సంఘటనలో 11 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం ఊటీ సమీపంలోని వెల్లింగ్టన్ మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలు దాదాపు 80 శాతం ఉండడంతో తీవ్ర స్థాయిలో చికిత్స అందిస్తున్నట్లు మిలిటరీ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో ప్రధానితో భేటీ అయ్యారు. దీనికి కొనసాగింపుగా ప్రధాని ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తుకు ఆర్మీ ఆదేశించింది.

ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మేజర్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, మరో 12 మంది ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వెల్లింగ్టన్‌ మిలిటరీ ట్రెయినింగ్ సెంటర్‌లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు అధికారులంతా నేరుగా ఢిల్లీ నుంచి ఎంఐ-17 వీ-5 అనే రకానికి చెందిన కె-3602 అనే నెంబర్ హెలికాప్టర్‌లో బయలుదేరినట్లు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. కోయంబత్తూరులోని మిలిటరీ కేంద్రం దగ్గరి నుంచి 11.47 గంటలకు బయలుదేరిన హెలికాప్టర్ నీలగిరి (తమిళనాడు) జిల్లా కూనూరు సమీపంలో 12.20 గంటలకు కూలిపోయింది.

ప్రమాదం జరిగిన సంఘటన తెలిసిన వెంటనే ఆర్మీ, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. హెలికాప్టర్ కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. కాలిన గాయాలతో గుర్తుపట్టడానికి వీలు లేని పరిస్థితుల్లో 11 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక పరిస్థితిపై ఆర్మీ వర్గాలు స్పష్టమైన సమాచారాన్ని వెల్లడించలేదు. సుమారు 80% కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన ముగ్గురిలో బిపిన్ రావత్ ఉన్నట్లు అనధికార సమాచారం వస్తున్నది. సంఘటనా స్థలానికి చేరుకున్న తమిళనాడు ఫారెస్టు మంత్రి రామసుందరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ప్రమాదం జరిగిన హెలికాప్టర్‌‌లో తొమ్మిది మంది పేర్లను వెల్లడించారు. ఆ ప్రకారం హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నవారు డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కర్నల్ హర్ జిందర్ సింగ్, ఎన్ కే గురుసేవక్ సింగ్, ఎన్ కే జితేంద్ర కుమార్, ఎన్ కే వివేక్ కుమార్, ఎన్ కే బి సాయితేజ, సత్పాల్ తదితరులు ఉన్నారు. వీరికి అదనంగా అదే హెలికాప్టర్‌‌లో సాయి గిరిజ, విజేంద్ర కుమార్ కూడా ఉన్నట్లు తెలిసింది.

ప్రమాదానికి కారణాలను నిర్దిష్టంగా వెల్లడించకపోయినప్పటికీ వాతావరణ ప్రతికూల పరిస్థితులు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వాతావరణ విభాగం నుంచి స్పష్టమైన అనుమతి రాకుండా హెలికాప్టర్ బయలుదేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రష్యా దేశానికి చెందిన ఈ హెలికాప్టర్ దాదాపు ఇరవై ఏళ్ళుగా వినియోగంలో ఉన్నదని, మెకానికల్ సమస్యలేమైనా కూలిపోవడానికి దారితీశాయా అనే అనుమానమూ ఉన్నది. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆర్మీ ఆదేశించింది. చికిత్స అందించేందుకు కోయంబత్తూరు మిలిటరీ ఆస్పత్రి నుంచి హుటాహుటిన ఆరుగురిని వెల్లింగ్డన్ ఆస్పత్రికి తరలించారు.

ఆర్మీ హెలీకాప్టర్ ప్రమాదంపై స్థానికులు ఏం చెబుతున్నారంటే..?



Next Story

Most Viewed