ఆలయ మహిళా పూజారి దారుణ హత్య- దోపిడీ దొంగలపనేనా ?

by  |
priest
X

దిశ, జల్‌పల్లి : ఆలయ మహిళా పూజారి దారుణ హత్యకు గురైన సంఘటన పహాడీషరీఫ్​ పోలీస్‌స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది.ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు .. రంగనాయకుల కాలనీ నుంచి మామిడిపల్లి వెళ్లే దారిలో ఉన్న అతి ప్రాచీనమైన రంగనాయకుల దేవాలయంలో కౌశిక్‌ శోభాశర్మ(76), ఆమె కుమారుడు మనోజ్‌శర్మలు పూజారులుగా కొనసాగుతున్నారు. ఆమె కుటుంబం నగరంలో ఉంటుండగా శోభాశర్మ ఒంటరిగానే ఆలయంలో ఉంటూ దేవుడికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

కాగా ఈ నెల 28వ తేదీన రాత్రి 7.30 గంటలకు మనోజ్​ తన తల్లి శోభాశర్మకు ఫోన్​ చేశాడు. ఎంతసేపటికి తల్లి ఫోన్ ఎత్తలేదు. దీంతో మనోజ్​ మామిడిపల్లికి చెందిన యువకుడికి ఫోన్​ చేసి తన తల్లి దగ్గరికి వెళ్లి రమ్మని చెప్పాడు. అక్కడికి చేరుకున్న యువకుడికి శోభాశర్మ తీవ్ర గాయాలతో మృతిచెంది ఉండడం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పహడీషరీఫ్​ ఇన్‌స్పెక్టర్​ సి.వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

శోభాశర్మ మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లుగా ఆనవాలు కనిపించడంతో పాటు ముఖంపై కూడా రక్తపు గాయాలున్నాయి. శోభాశర్మ నివసించే గదిలో ఉన్న బీరువా తలుపులు కూడా పగుల కొట్టి ఉండడం కనిపించింది. దోపిడీకి వచ్చిన దొంగలే ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శవ పంచనామ నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కుమారుడు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహడీషరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed