లాక్‌డౌన్‌.. రేట్స్ రైజ్

by  |
లాక్‌డౌన్‌.. రేట్స్ రైజ్
X

దిశ, న్యూస్‌ బ్యూరో: కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్య మానవుడు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండాపోతోంది. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా నిల్చిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులు ఆగిపోయాయి. దీంతో ఉన్న సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లాక్‌డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుందోనన్న భయంతో ప్రజలు ప్రస్తుత అవసరాలకు మించి కొనుగోలు చేయడంతో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత తీవ్రత పెరగడంతోపాటు ధరలు రెట్టింపు అవుతున్నాయి.
కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడా స్తంభించిపోవడం నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య మానవునికి అందనంత దూరాన ఆకాశానంటుతున్నాయి. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా, కేరళ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే నిత్యావసర సరుకులు నిల్చిపోవడంతో మార్కెట్లో సరుకుల కొరత ఏర్పడింది. ఉన్న సరుకులకు రేట్లు పెంచి వ్యాపారులు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లోనే రేట్లు పెంచడంతో రిటెయిల్ మార్కెట్‌కు వచ్చేసరికి ధరలు రెట్టింపు అవుతున్నాయి. ఈ నెల 21న దేశవ్యాప్తంగా విధించిన కర్ఫ్యు మొదలుకొని నేటివరకు హోల్‌సేల్ మార్కెట్ల నుంచి రిటెయిల్ మార్కెట్లకు సరుకుల రవాణా నిలిచిపోయింది. ఉన్న సరకుల ధరలు పెంచి విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. కర్ఫ్యూ అనంతరం వెంటనే 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించడంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న భయంతో ప్రజలు ముందస్తుగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత అవసరాలకు మించి ఎక్కువగా కొనుగోలు చేయడంతో మార్కెట్లలో 100 మందికి సరిపడా సరుకులు 10 మంది మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల కొరత తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులు పప్పులు, పిండి, నూనె, ఆయిల్, కొబ్బరిని ఉన్న ధరల కంటే రూ.5 నుంచి 10 పెంచుకువిక్రయిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాలి

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, ఇలా వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకుంటే తప్ప ధరల నియంత్రించలేమంటున్నారు వ్యాపారులు. మహారాష్ట్ర నుంచి ఎక్కువగా పప్పులు, పిండి దిగుమతి అవుతాయి. వారం రోజుల నుంచి పూర్తిగా నిల్చిపోవడంతో రాష్ట్రంలో పప్పు, పిండికొరత నెలకొంది. ఆంధ్రా నుంచి దిగుమతి అయ్యే బియ్యం కూడా నిల్చిపోవడంతో కిలో రూ.10 ధర పెంచి వ్యాపారులు విక్రయిస్తున్నారు. కేరళ నుంచి రావాల్సిన కొబ్బరికాయలు రాకపోవడంతో ఉగాది పండుగా సందర్భంగా రూ.20 ఉన్న కొబ్బరి రూ.30 విక్రయించాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు వ్యాపారులు. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్ప ప్రజలకు నిత్యావసర సరుకులు అందించలేమని వ్యాపారులు వాపోతున్నారు. వాహనాలకు అనుమతి ఇవ్వడమే కాకుండా ఎగుమతి, దిగుమతి చేసే హమాలి కూలీలకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి వెసులుబాటు కల్పించాలంటున్నారు. హోల్‌సేల్ మార్కెట్ నుంచి రిటెయిల్ మార్కెట్లకు రవాణా సౌకర్యం కల్పించాలని వ్యాపారులు కోరుతున్నారు.

TAGS : Market, labor, export, import, Wholesale, Ritel , Maharashtra, Karnataka, Andhra, Kerala



Next Story

Most Viewed