రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా?

by Disha edit |
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా?
X

యుద్ధంతో ఆ ప్రాంత పర్యావరణ విధ్వంసం, పేదల శ్రమ దోపిడీ, ఆర్థిక కుదుపులు, సరుకుల ధరల పెరుగుదల ఆహార ధాన్యాల కొరత ఎక్కువయ్యింది. రష్యా చమురును వ్యతిరేకిస్తూ అమెరికా, యూరప్ దేశాలు కఠిన ఆంక్షలు విధించడంతో రష్యా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రష్యా కరెన్సీ కనిష్ట స్థాయికి పడిపోవడంతో పాటు దాదాపు 66 శాతం ముడి చమురును అమ్ముకోలేని దుస్థితికి చేరింది. రోజు రోజుకూ పరిస్థితులు విషమించి, మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. పుతిన్ చేతులలో అణ్వాయుధాల విన్యాసాలు జోరందుకున్నాయి. ఉక్రెయిన్‌‌లో ఉత్పత్తి రంగం కుంటుపడడం, వ్యవసాయం మూలకు పడడం, శ్రామికులు బజారున పడడం, పరిశ్రమలు ధ్వంసం కావడం, రవాణాకు ఆటంకాలు కలగడం లాంటి సమస్యలు వెంటాడుతున్నాయి.

మూడో ప్రపంచ యుద్ధానికి దారులు పడుతున్నాయా!? 24 ఫిబ్రవరి 2022న మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేటీకి కొనసాగుతూ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి రెండు దేశాలకు మద్దతిస్తున్నాయి. ఈ సుదీర్ఘ యుద్ధం వలన ప్రపంచంలోని సుమారు 1.6 బిలియన్ ప్రజలు జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తున్నది. దాదాపు 1.2 బిలియన్ మంది ప్రజలు ఆహారం, ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ఉక్రెయిన్‌వాసులు దేశం వదిలి పోతున్నారు. పలు దేశాల సామాన్య జనులు ఆహార కొరత, నీటి ఎద్దడి, ఆరోగ్య వసతుల లేమి వంటి సమస్యలలో చిక్కుకున్నారు.

Also read: వరల్డ్ వాక్: మారుతున్న విదేశీ విధానం

అక్కడ సైనిక పోరు జరిగితే

ఉక్రెయిన్ నుంచి దిగుమతి తగ్గడంతో పలు దేశాలు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉక్రెయిన్ పౌరులకు హాని కలగడమే కాకుండా, అసంఖ్యాక సామాన్య జనం అత్యవసరాలకు దూరం అయ్యారు. ఈ యుద్ధంతో ఆరు మిలియన్‌ల ప్రజలు నిరాశ్రయులయ్యారు. 13 వేల మంది పౌరులు గాయపడటంతో పాటు ఐదున్నర వేల మంది ఉక్రెనియన్లు మరణించి ఉంటారని అంటున్నారు. ఆగస్టు 2022 నాటికి ఉక్రెయిన్‌వాసులు సుమారు 6.6 మిలియన్‌ల మంది నిర్వాసితులుగా మారి పోలాండ్, హంగేరీ, రొమేనియా, స్లోవేకియా, మోల్డోవా వంటి యూరప్ దేశాలకు వలస వెళ్లారు.

యుద్ధం కారణంగా ఉక్రెయిన్ సముద్ర, గగనతల రవాణా ఎగుమతులు ఆగిపోయి 400 మిలియన్‌ ప్రజలు ఆకలి కేకలతో కాలం గడుపుతున్నారు. ఈస్ట్‌ ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్‌, సెంట్రల్‌ అమెరికా దేశాలు యుద్ధం మూలంగా కరువును ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్ దేశంలోని 'జరోరిజియా న్యూక్లియర్ ప్లాంట్' ను రష్యా ఆక్రమించి సైనిక పోరు జరుపుతుందని, అది ప్రమాదకరంగా మారవచ్చని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ అణు కేంద్రంపై దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. రష్యాకు చెందిన అతి ముఖ్యమైన 'క్రిమియన్' ప్రాంత రవాణా వారధి విధ్వంసం కావడంతో పుతిన్ సేనలు ఉక్రెయిన్‌పై ప్రతీకారం తీర్చకునేందుకు ఆగ్రహావేశంతో ఊగిపోతున్నాయి.

Also read: వరల్డ్ వాక్: సంక్షోభంలోనూ మేలైన దిగుమతి

రష్యాకు నష్టమే

అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ శరణార్థులతో పాటు ఇతర దేశాల శరణార్థుల పట్ల మానవీయతతో మెలగాలి. మానవీయ కోణంలో వారికి కనీస అవసరాలు, ఆర్థిక సహాయం, అత్యవసరాల పంపిణీ, ఆరోగ్య సేవలు అందించడానికి సమాజం ముందుకు రావాలి. ఈ యుద్ధంతో ఆ ప్రాంత పర్యావరణ విధ్వంసం, పేదల శ్రమ దోపిడీ, ఆర్థిక కుదుపులు, సరుకుల ధరల పెరుగుదల ఆహార ధాన్యాల కొరత ఎక్కువయ్యింది. రష్యా చమురును వ్యతిరేకిస్తూ అమెరికా, యూరప్ దేశాలు కఠిన ఆంక్షలు విధించడంతో రష్యా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.

రష్యా కరెన్సీ కనిష్ట స్థాయికి పడిపోవడంతో పాటు దాదాపు 66 శాతం ముడి చమురును అమ్ముకోలేని దుస్థితికి చేరింది. రోజు రోజుకూ పరిస్థితులు విషమించి, మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. పుతిన్ చేతులలో అణ్వాయుధాల విన్యాసాలు జోరందుకున్నాయి. ఉక్రెయిన్‌‌లో ఉత్పత్తిరంగం కుంటుపడడం, వ్యవసాయం మూలకు పడడం, శ్రామికులు బజారునపడడం, పరిశ్రమలు ధ్వంసం కావడం, రవాణాకు ఆటంకాలు కలగడం లాంటి సమస్యలు వెంటాడుతున్నాయి.


డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

కరీంనగర్, 99497 00037



Next Story

Most Viewed