ఆఫ్ఘన్ లో కల్లోలం.. హైదరాబాద్ లో ఎఫెక్ట్

by  |
ఆఫ్ఘన్ లో కల్లోలం.. హైదరాబాద్ లో ఎఫెక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘన్ కల్లోలానికి గురవుతుంటే ఆ ఎఫెక్ట్ భారత్ పై కూడా పడింది. ఈ పరిణామాలు క్రమంగా ఎగుమతులపై పడటంతో డ్రైఫ్రూట్స్ ధరలకు భారీగా రెక్కలొచ్చాయి. ఆఫ్ఘన్ నుంచి భారత్ కు ముఖ్యంగా కిస్మిస్, మునక్కా, అంజీర్, అఖ్రత్, చిల్గోజా, ఖుబాని, సాజీరా, ఇంగువ, సుగుంధ ద్రవ్యాలు, బాదంను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో భారత్ సహా పలు దేశాలకు తాత్కాలికంగా ట్రేడింగ్‌ను నిలిపివేశారు. దీనికితోడు ఆ దేశ సరిహద్దులు మూసేయడం వల్ల కూడా ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం లేక డ్రైఫ్రూట్స్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఆఫ్ఘన్ నుంచే అత్యధికంగా 85 శాతం డ్రైఫ్రూట్స్ ను భారత్ దిగుమతి చేసుకుంది. దీని విలువ 550 మిలియన్ డాలర్లుగా వ్యాపారులు చెబుతున్నారు.

ట్రాన్స్ పోర్ట్ లేక తగ్గిన దిగుమతులు

ఆఫ్ఘన్ తాలిబన్ల వశం కావడంతో వెంటనే దేశ సరిహద్దులను మూసేశారు. దీంతో రవాణా మార్గం లేకపోవడంతో దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికితోడు కాలిఫోర్నియా నుంచి దిగుమతి చేసుకునే బాదం పంటకు కూడా తీవ్ర నష్టాలు వాటిల్లడంతో అక్కడి నుంచి కూడా ఎగుమతి తగ్గిపోయింది. రవాణాకు కూడా సరిపడ కంటైనర్లు లేకపోవడంతో దిగుమతి చేసుకునేందుకు ఇబ్బందిగా మారింది. వచ్చిన కొంత కూడా అధిక ధరలకు కొనాల్సి వస్తుండటంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. తిరిగి విక్రయించాలంటే కొనేందుకు ముందుకు రావడంలేదని వాపోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ, జమ్మూకశ్మీర్ మార్కెట్లలో డ్రైఫ్రూట్స్ ధరలు మూడు రెట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముంబై మీదుగా ఓడ మార్గం ద్వారా సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ ను తరలించేవారు. అంతేకాకుండా పాకిస్థాన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి లోడ్లు వచ్చేవి. తాజాగా ఎక్స్ పోర్ట్ నిలిచిపోవడంతో డిమాండ్ అండ్ సప్లయ్ లో తేడాలొచ్చాయి. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. గతంలో కిలో ఎండు ద్రాక్ష ధర హోల్ సేల్ లో రూ.800 గా ఉంటే తాజాగా రూ.1300కు చేరుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంజీర్ రూ.900 ఉంటే తాజాగా రూ.1200కు పెరిగింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత వ్యాపారులకు మొత్తం 200 ట్రక్కుల డ్రై ఫ్రూట్స్ దిగుమతి కావాల్సి ఉండగా వాటి ఎగుమతిని కూడా నిలిపివేశారు. దాంతో వాటికి ఆర్డర్లు ఇచ్చిన వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. అంతేగాక ఇంకొన్నాళ్లు సరఫరా ఇలాగే నిలిచిపోతే డ్రై ఫ్రూట్స్ ధరలు బాగా పెరిగే ప్రమాదం ఉంది. గతం నుంచే సామాన్యులకు అందని ద్రాక్షగా మారిన డ్రైఫ్రూట్స్ భవిష్యత్ లో కూడా కొనలేనంత భారంగా మారనున్నాయి. ప్రస్తుతం 15 రోజులకు సరిపడా నిలువలు మాత్రమే ఉన్నాయని, డ్రై ఫ్రూట్స్ కొరత కారణంగా వాటి ధరలు ఇప్పటికే 40 శాతం వరకు పెరిగాయని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు మారి వాణిజ్యం మొదలయ్యే వరకు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశముంది. అప్పటి వరకు ఈ భారం మోయాల్సిందేనని చెబుతున్నారు.

కస్టమర్లు తగ్గిపోయారు..

కొవిడ్ సమయంలో వ్యాపారం లేక తీవ్రంగా నష్టపోయాం. అద్దె చెల్లించేందుకు కూడా కష్టాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ట్రాన్స్ పోర్ట్ లేక సరుకు మొత్తం నిలిచిపోయింది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. తద్వారా డ్రైఫ్రూట్స్ కొనేందుకు కొనుగోలుదారులు ముందుకురావడం లేదు. వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. రెగ్యులర్ క్వాలిటీ కిలో బాదం రేటు గతంలో రూ.600 ఉంటే ఇప్పుడు కిలో రూ.1000 వరకు పెరిగింది. జీడిపప్పు కూడా రూ.950 వరకు పెరిగింది. ఈ పెరిగిన ధరలతో కొనాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. ధరలు ఎక్కువగా ఉన్నాయని కస్టమర్లు కూడా ముందుకు రావడంలేదు. గతంలో అవసరానికన్నా ఎక్కువ కొనేవారు. ఇప్పుడు అవసరమున్న దానికంటే తక్కువ కొనుగోలు చేస్తున్నారు.
= డేనియల్, డ్రైఫ్రూట్స్ హోల్ సేల్ వ్యాపారి, హైదరాబాద్.

Next Story