కనెక్టివిటీ మిస్సయిన 'భారత్‌నెట్'!

by  |
కనెక్టివిటీ మిస్సయిన భారత్‌నెట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : దాదాపు 6.25 లక్షల గ్రామాలను కలుపుతూ 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించే భారత్‌నెట్ ఇప్పటికీ అనేక గ్రామాలకు కలగానే మిగిలింది. మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయితీలను అనుసంధానించే లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికి 2.5 శాతం మాత్రమే పూర్తయింది. గ్రామాల్లో మొత్తం 45,769 వై-ఫై హాట్‌స్పాట్‌లు ఉండగా వాటిలో 18,041 మాత్రమే పనిచేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌తో సహా ఏడింటిలో ఐదు ఈశాన్య రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వై-ఫై హాట్‌స్పాట్‌లలో సగం కూడా పనిచేయటంలేదని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా సంబంధిత మంత్రి తెలిపారు.

2011లో అప్పటి ప్రభుత్వం ఇంటర్‌నెట్ కనెక్టివిటీని మెరుగు పరిచేందుకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ చొరవను ఆమోదించింది. ఆ తర్వాత దీనికి భారత్‌నెట్ అనే పేరుగా మార్చారు. ఈ ప్రాజెక్ట్ ఆమోదం పొందిన తొలినాళ్లలో పనులు ఏ మాత్రం ముందుకు సాగలేదు. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌కు ప్రచారం బాగా జరిగింది. ప్రచారమైతే జరిగింది కానీ, పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయి.

ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత్‌నెట్ ప్రాజెక్ట్ నిర్వహణకు రూ. 6000 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. సరసమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు సెకన్‌ను కనీసం 2 మెగాబైట్‌ల ఇంటర్‌నెట్ వేగాన్ని అన్ని రకాల గృహాలకు, సంస్థలకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటివరకు, భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద దేశంలోని గ్రామ పంచాయితీల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని సులభతరం చేసేందుకు రూ. 42,068 కోట్లు ఆమోదించబడ్డాయి. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేస్తున్నారు. తొలి దశలో 1 లక్ష గ్రామ పంచాయితీలు, రెండో దశలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలు, మూడో దశలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అన్ని గ్రామ పంచాయితీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి భారత్‌నెట్ ప్రాజెక్టును దశల వారీగా అమలు చేస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ఓ సభలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed