కన్నుల పండువగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

by  |
Rayalaseema
X

దిశ, రాయలసీమ: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు కలిగిన పెద్దశేషవాహనంపై వైకుంఠ‌నాథుని(శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచ‌క్రాలు, గ‌దతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కొవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. శ్రీ పద్మావతి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు.

అభయ వరదహస్తమైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవ దర్శనం వల్ల యోగశక్తి కలుగుతుంది. వాహనసేవలో పెద్దజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, ప్రభుత్వ విప్ డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శేషగిరి, ఏవిఎస్వో వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed