వైన్ షాపులు మూసేయండి : హైకోర్టు

by  |
వైన్ షాపులు మూసేయండి : హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం వైన్ షాపుల్ని మూసేయాలని, జనం గుమికూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేసే ఉద్దేశం లేనందున ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, రద్దీ లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వైరస్ వ్యాప్తి జరగకుండా చూసుకోవాలని ఆదేశించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు వాయిదా వేయలేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్నా ఎన్నికలకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని విచారణకు స్వయంగా హాజరైన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిని హైకోర్టును నిలదీసింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? లేక ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించింది. యుద్ధం వచ్చినా, ఆకాశం విరిగిపోయి మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా అని ఘాటుగానే వ్యాఖ్యానించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అసలు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు గమనిస్తున్నారా అని ప్రశ్నించింది. ఎస్ఈసీ అధికారులు భూమిపైనే నివసిస్తున్నారా లేక ఆకాశంలో ఉంటున్నారా అని వ్యాఖ్యానించింది. కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా సమయం ఉన్నా ఇప్పుడే ఎందుకు నిర్వహించాల్సి వస్తోందని ప్రశ్నించింది.

ఎన్నికల సంఘం కార్యదర్శి స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఫిబ్రవరిలోనే కరోనా సెకండ్ వేవ్ మొదలైనా ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని ఆయన్ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. ఎన్నికలను వాయిదా వేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదా అని ప్రశ్నించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇస్తున్న వివరణ సంతృప్తికరంగా లేదంటూ మొట్టికాయలు వేసింది.

కనీసం ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా ఎందుకు కుదించలేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణ కర్తవ్యాన్ని వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.


Next Story

Most Viewed