బీజేపీలోకి కూకట్‌పల్లికి చెందిన కీలక నేత..?

by Disha Web Desk |
బీజేపీలోకి కూకట్‌పల్లికి చెందిన కీలక నేత..?
X

దిశ, కూకట్​పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రాష్ట్రంలో రోజు రోజుకు చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో కూకట్‌పల్లిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో మాస్​లీడర్‌గా పేరొందిన ఖనిజాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్​వడ్డెపల్లి నర్సింగరావు కుమారుడు వడ్డెపల్లి రాజేశ్వర్​రావు బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. వైఎస్సార్​హయాంలో ఓ వెలుగు వెలిగిన మాస్​లీడర్ వడ్డెపల్లి నరసింగరావు వారసుడు రాజేశ్వర్​రావు వైఎస్​జగన్‌తో అదే సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ గత రెండు దఫాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం సలహామండలి సభ్యులుగా కొనసాగుతున్నారు.

కూకట్​పల్లి వడ్డెపల్లిదే..

సుధీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వడ్డెపల్లి కుటుంబానికి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో రాజేశ్వర్​రావు క్రీయాశీలక రాజకీయాలల్లో ఉంటే ప్రధాన​పార్టీలకు గట్టి పోటీ ఉండే అవకాశాలు లేక పోలేదు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వడ్డెపల్లి రాజేశ్వర్​రావు కేంద్రంలోని ఓ పెద్ద నాయకుడితో టచ్‌లో ఉన్నారని, త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వడ్డెపల్లి రాజేశ్వర్​రావు బీజేపీలో చేరితే గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన ఆ పార్టీకి కూకట్​పల్లిలో మరింత బలం చేకూరుతుందనడంలో సందేహం లేదు.

వడ్డెపల్లి రాజేశ్వర్​రావును కలిసిన బీజేపీ నేత

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్​రెడ్డి శుక్రవారం వడ్డెపల్లి రాజేశ్వర్​రావును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. దీంతో వడ్డెపల్లి రాజేశ్వర్​రావు త్వరలో బీజేపీలో చేరుతున్నారన్న చర్చ బలంగా కొనసాగుతుంది. రాజేశ్వర్​రావు ఎప్పుడు అధికారికంగా బీజేపీలో చేరుతారో వేచి చూడాల్సి ఉంది.

కూకట్​పల్లిలో బీజేపీ పుంజుకుంటుందా...?

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూకట్‌పల్లిలో అధికార పార్టీ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన బీజేపీ గ్రేటర్​ఎన్నికలలో మూసాపేట్​ డివిజన్‌లో జెండా ఎగరేయడంతో ఆ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపింది. గత అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీలో ఉన్న హరీష్​రెడ్డి గ్రేటర్​ ఎన్నికల ముందు బీజేపీలో చేరడం, మేడ్చల్​జిల్లా అర్బన్​అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత జరిగిన గ్రేటర్​ఎన్నికలలో అధికార పార్టీ నాయకులకు పోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లలో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మూసాపేట్​డివిజన్‌లో విజయం సాధించారు. దాని తరువాత హరీష్​రెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి మాధవరం కాంతారావులు నియోజకవర్గంలో పాదయాత్రలు, సమస్యలపై పోరాటం చేస్తూ, బూత్​స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే కూకట్​పల్లిలో మంచి పట్టున్న వడ్డెపల్లి రాజేశ్వర్​రావు బీజేపీలో చేరితే ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed