మునుగోడు ఉపఎన్నికలకు TRS భారీ స్కెచ్.. భారీ బహిరంగ సభకు ప్లాన్

by Disha Web Desk 4 |
మునుగోడు ఉపఎన్నికలకు TRS భారీ స్కెచ్.. భారీ బహిరంగ సభకు ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు గులాబీ పార్టీ ప్లాన్ చేస్తుంది. లక్ష మందితో సభ నిర్వహించి టీఆర్ఎస్ సత్తా చాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరహాలోనే మునుగోడులోనూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనుంది. సభలోనే పెండింగ్ పనుల పూర్తికి నిధులు మంజూరు, అక్కడికక్కడే జీవోలు సైతం ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రజలకు వరాలు, పెండింగ్ పనుల పూర్తికి చర్యలు చేపట్టనున్నారు. అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళ్లనుంది గులాబీ పార్టీ.

రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతోంది. ఈ నెల 8న మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో ఎన్నిక అనివార్యమే. అయితే రాజీనామా ఆమోదం, ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేందుకు కొంత గడువు ఉంటుంది. ఈ గడువులోగా మునుగోడులో భారీ బహిరంగసభను లక్షమందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం నేతలకు సూచించినట్లు సమాచారం. ఈ సభలోనే పెండింగ్ పనుల పూర్తికి నిధులు మంజూరు ప్రకటన, నిధుల జీవోలు, ప్రజలకు వరాలు కురిపించనున్నారు పార్టీ అధినేత కేసీఆర్. ఏ పెండింగ్ పనికి ఎంత నిధులు కేటాయిస్తున్నాం... ఇప్పటివరకు ఎంత కేటాయించాం... ఎందుకు కేటాయిస్తున్నామనే విషయాన్ని సైతం స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందనే ప్రకటన సైతం కేసీఆర్ చేయనున్నారు. ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి వైఫల్యాలను సైతం ఎండగట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు మునుగోడుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను సైతం వివరించడంతో పాటు ఫ్లోరోసిస్ రక్కసికి టీఆర్ఎస్ చేపట్టిన చర్యలను ప్రజలకు మరోసారి విశ్లేషించనున్నారు.

మునుగోడులో బై ఎలక్షన్స్ వస్తాయని ముందస్తుగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు స్పీడ్ పెంచాయి. అందులో భాగంగానే శుక్రవారం చండూరులో నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలు సైతం పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను వివరించారు. మరోపక్క ఈ నెల 21న మునుగోడులో భారీ సభకు సమాయత్తమవుతోంది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషాతో పాటు పలువురు నేతలు హాజరవుతున్నారు. ఈ సభలో రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారు. ఇప్పటికే మునుగోడులో పాగా వేసేందుకు బీజేపీ అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ సభలకు ధీటుగా టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని గులాబీ అధిష్టానం భావిస్తోంది. ఈ సభతో ప్రజల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే భావనను తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నారు.

మునుగోడు గడ్డపై రెండోసారి టీఆర్ఎస్ విజయం సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ వేసే ఎత్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిపై ఎత్తులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కసరత్తును ప్రారంభించింది. మరో వైపు సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పార్టీల బలబలాలను తెలుసుకుంటుంది. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా పెండింగ్ పనుల పూర్తికి ఎస్టిమేషన్ సైతం కేసీఆర్ తెప్పించుకున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా నిధుల మంజూరు, నియోజకవర్గంలో ఆసరా, దళితబంధు, ఇతర సంక్షేమ పథకాలు అర్హులందరీకి అందజేసేలా చర్యలకు సిద్ధమవుతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఏ విధంగా నైతే నిధులు కేటాయించారో అదే పద్దతిన నిధులు మంజూరు చేయనున్నట్లు సమాచారం. కానీ అక్కడ జరిగిన తప్పిదం మాత్రం మునుగోడులో జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. బై ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే మునుగోడుకు వరాలు, నిధులు ఇవ్వనున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed