'మేం కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రఘునందన్ రావు పంపిణీ చేయడం హాస్యాస్పదం'

by Dishanational1 |
మేం కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రఘునందన్ రావు పంపిణీ చేయడం హాస్యాస్పదం
X

దిశ, దుబ్బాక: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నీచమైన రాజకీయం చేస్తున్నాడని మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత ఆరోపించారు. ప్రజాప్రతినిధులుగా తమను పట్టించుకోకుండా దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తామని హడావుడీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్యే రఘునందన్ రావు లబ్ధిదారులను ఉసిగొల్పే పని చేస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక పట్టణంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయించి అహర్నిశలు శ్రమించి నిర్మాణం చేపడితే తనే ఆ పని చేసినట్టు రఘునందన్ రావు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయడంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులను కాదని హడావుడీ చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు తెచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. అభివృద్ధి చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేయాలని, అందుకు అందరం కలిసి వస్తామని చెప్పారు. అంతేగానీ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను తానే చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రఘునందన్ రావు తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. దుబ్బాక డబుల్ బెడ్రూం ఇండ్లలో ఎంతో అంగరంగ వైభవంగా గృహప్రవేశాలు చేసుకుందామనుకున్న లబ్ధిదారులను మాయ మాటలు చెప్పి ఎమ్మెల్యే రఘునందన్ రావు బలవంతంగా గృహ ప్రవేశాలు చేయించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రవిందర్ రెడ్డి, రొట్టె రాజమౌళి, ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు ఆస యాదగిరి, కనకయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ పాల్గొన్నారు.


Next Story

Most Viewed