అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

by Batti.Sumithra |

అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికల కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు చేధించారు. సాంకేతిక ఆధారాలతో బాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
X

దిశ, రాజేంద్రనగర్ : అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికల కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు చేధించారు. సాంకేతిక ఆధారాలతో బాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు టీఎన్‌జీవోస్ కాలనీలో గత ఏడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఆ కుటుంబాలకు చెందిన పదో తరగతి చదువుతున్న ఒక బాలికతో పాటు ఏడో తరగతి చదువుతున్న మరో ఇద్దరు బాలికలు స్నేహితులు. బాలికలను ఇంట్లో తరచూ చిన్న చిన్న విషయాలకు తల్లిదండ్రులు మందలిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆ ముగ్గురు ఇంటి నుంచి పారిపోయి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల 24వ తేదీన ఇంటి నుంచి తప్పించుకుని వెళ్లారు. దీంతో బాలికల తల్లిదండ్రులు 25వ తేదీన బాలికలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. రాజేంద్రనగర్ డీసీపీ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలికల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. బాలికల్లో ఒకరు రహస్యంగా తీసుకెళ్లిన మొబైల్ ఫోన్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో బాలికలు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని బీనా రైల్వే స్టేషన్ వద్ద రైలులో తనిఖీ చేసి ముగ్గురు బాలికలను సురక్షితంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సమావేశంలో ఏసీపీ సుధాకర్, సీఐ శ్రీనివాస్, డీఐ మక్సూద్ అలీ, ఎస్‌ఐ విశ్వనాథ్ రెడ్డిలు పాల్గొన్నారు.

Next Story