రోగులు ఫుల్.. వైద్యులు నిల్!

by Jakkula.Mamatha |

తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.

రోగులు ఫుల్.. వైద్యులు నిల్!
X

తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ ఆసుపత్రికి ప్రతిరోజూ 100 నుంచి 170 మంది వరకు రోగులు వస్తుండగా సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో పేద ప్రజలకు అరకొర వైద్యమే అందుతోంది. వాస్తవానికి ఇక్కడ ఇద్దరు వైద్యులు సేవలందించాల్సి ఉన్నా ప్రస్తుతం ఇక్కడ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పల్లె దవాఖాన వైద్యులు రోజుకో చొప్పున ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా పూర్తిస్థాయి వైద్యం అందడం లేదు. వీటితో పాటు బిల్లుపాడు ఏఎన్ఎం, మిట్టపల్లి ఎల్‌హెచ్‌వీ, నారాయణపురం ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముద్దునూరు ఏఎన్ఎం డిప్యుటేషన్‌పై ఖమ్మం వెళ్లారు. మొత్తం పది సబ్ సెంటర్లకు గాను కొన్ని సెంటర్లలో సెకండ్ ఏఎన్ఎంలతోనే విధులు నిర్వహిస్తున్నారు.

దిశ, తల్లాడ: తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకంతో వచ్చే పేద ప్రజలకు అరకొర వైద్యమే అందుతోంది. తల్లాడ మండల వ్యాప్తంగా ఈ ఆసుపత్రికి ప్రతిరోజూ 100 నుంచి 170 మంది వరకు రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో వైద్యం అందక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కరే డాక్టర్..

నిబంధనల ప్రకారం.. తల్లాడ పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండాలి. కానీ ప్రస్తుతం ఇక్కడ ఒక్కరే వైద్యురాలు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో మండల పరిధిలోని 27 గ్రామ పంచాయతీల నుంచి వచ్చే రోగులందరికీ చికిత్స చేయడం ఆ ఒక్క వైద్యురాలికే తీవ్ర భారంగా మారింది. మండల వైద్యాధికారిగా ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, పల్లె దవాఖానాలను పర్యవేక్షించడంలోనూ బిజీగా ఉంటున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం పల్లె దవాఖాన వైద్యులు రోజుకో చొప్పున ఇక్కడ విధులు నిర్వహిస్తున్నప్పటికీ పూర్తిస్థాయి వైద్యం అందడం లేదు.

ఖాళీగా పోస్టులు..

వైద్యులతో పాటు ఇతర సిబ్బంది కొరత పీహెచ్‌సీని వేధిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, టీబీ ల్యాబ్‌లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత కొద్ది నెలలుగా ఈ పోస్టుల భర్తీ జరగడం లేదు. వీటితో పాటు బిల్లుపాడు ఏఎన్ఎం, మిట్టపల్లి ఎల్‌హెచ్‌వీ, నారాయణపురం ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముద్దునూరు ఏఎన్ఎం డిప్యుటేషన్‌పై ఖమ్మం వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. మొత్తం పది సబ్ సెంటర్లకు గాను కొన్ని సెంటర్లలో సెకండ్ ఏఎన్ఎంలే విధులు నిర్వహిస్తున్నారు.

సర్దుబాటుతోనే విధులు: వైద్యాధికారి ప్రత్యూష వివరణ

పీహెచ్‌సీలో సిబ్బంది కొరతతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే. రోజుకు 100 మందికి పైగా రోగులు వస్తుండటంతో పరీక్షించడానికి సమయం పడుతోంది. పల్లె దవాఖానా వైద్యుల సహకారం తీసుకుంటున్నాం. ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నాం. ఉన్నతాధికారులు స్పందించి తల్లాడ పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైద్యాధికారి ప్రత్యూష తెలిపారు.

Next Story