బల్దియాలో విచిత్రాలు.. వాటిని కాదని నియామకాలు

by Dishafeatures2 |
బల్దియాలో విచిత్రాలు.. వాటిని కాదని నియామకాలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: విధాన నిర్ణయాలను కాదని, వింత నియామకాలు చేపట్టడంలో కరీంనగర్ బల్దియా తనకు తానే సాటి అని నిరూపించుకున్నట్టుగా ఉంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఔట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్టు పద్దతిన 25 మంది వర్కర్లను నియమించుకోవాలని సూచించింది. ఇందుకు పందుల పెంపకం దారులను మాత్రమే తీసుకోవాలని కూడా స్పష్టం చేసినప్పటికీ మెమోను కాదని నియామకాల ప్రక్రియ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

గణాంకాలు ఇలా..

తెలంగాణాకు హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేకంగా వర్కర్లను నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ కు లేఖ రాసింది. హరిత హారం కోసం 25 మంది వర్కర్లను నియమించుకునేందుకు అనుమతి ఇస్తూ, నగరంలో పందుల నివారణ కోసం వాటిని పెంచిపోషించే వారికి మాత్రమే జీవనోపాధి కల్పించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కార్యాలయం నుండి మెమో జారీ చేశారు.


ఆర్ఓసి నెం: 244686/2020/హెచ్, తేది 3/10/2020 ద్వారా అనుమతి ఇచ్చారు. కేవలం 25 మందిని మాత్రమే నియమించుకోవాలని, ఇందుకు పందుల పెంపకం దారులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టత ఇచ్చినప్పటికీ బల్దియా అధికారులు మాత్రం ఇందుకు ప్రాధాన్యత కల్పించకుండానే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు పద్దతిన వర్కర్లను నియమించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. నగరంలో పందుల పెంపకాన్ని సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండటంతో వీటిని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావించింది.

అనుమతులు లేకుండా..?

అయితే బల్దియాలో ఎలాంటి నియామకాలు జరిపినా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కమిషనరేట్ నుండి అనుమతి తీసుకోవల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. లేనట్టయితే ఎలాంటి నియామకాలు జరపకూడదన్న ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. అయినప్పటికీ 2018 నుండి ఇప్పటి వరకు 255 మంది వర్కర్లను నియమించుకున్నట్టు కార్పొరేషన్ రికార్డులు చెప్తున్నాయి. ఇందులో కేవలం 25 మందిని హరితహారం కార్యక్రమ నిర్వహణ కోసం తీసుకోవాలని ఎండి అనుమతి ఇచ్చింది. మిగతా వారందరిని అనుమతి లేకుండానే విధుల్లోకి తీసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మాకు అన్యాయం: కేమసారం తిరుపతి, తెలంగాణ ఎరకల ప్రజా సమితి అధ్యక్షుడు

కార్పొరేషన్ పరిధిలో పందుల పెంపకం ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పందుల పెంపకంతో ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని భావించి బల్దియాలో వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినప్పటికీ పందుల పెంపకం దారులు తప్ప ఇతరులను విధుల్లోకి తీసుకుంటున్నారు. దీనివల్ల పందుల పెంపకం దారులకు ఉపాధి లేకుండా పోయింది. పందుల పెంపకం దారులకు ఉపాధి కల్పించేందుకు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేయాల్సి ఉన్నా అధికారులు మాత్రం ఆదేశాలను అమలు చేయకపోవడం సరికాదు. ఇప్పటికైనా అధికారులు పందుల పెంపకం దారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చొరవ తీసుకోవాలి.

Next Story

Most Viewed