దళితులకు గుడ్‌న్యూస్‌.. మెడికల్ షాపుల్లోనూ రిజర్వేషన్లు!

by Disha Web Desk 2 |
దళితులకు గుడ్‌న్యూస్‌.. మెడికల్ షాపుల్లోనూ రిజర్వేషన్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్ షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు, రాయితీలు వంటివి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేయనున్నది. ఈ మేరకు ప్రత్యేక ఆఫీసర్లు ప్లాన్​సిద్ధం చేయనున్నారు. త్వరలో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని మంత్రి హరీష్​రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ఆయన మంగళవారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డీహెచ్​శ్రీనివాస్ రావు, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్‌తో కలిసి డ్రా ద్వారా ఆస్పత్రులను ఎంపిక చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీలకు 56 ఆసుపత్రుల్లో డైట్, శానిటేషన్ కాంట్రాక్టులు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. వంద పడకల లోపు ఆస్పత్రిని ఒక కేటగిరీగా, వంద పడకలకు పైగా ఉన్న ఆస్పత్రిని మరో కేటగిరీగా విభజించామన్నారు. ఏయే ఆస్పత్రులను రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మొత్తం 56 ఆస్పత్రులను దళితులకు కేటాయించడం జరిగిందన్నారు. వీటికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్లు నిబంధనల్లోనూ మార్పులు చేశామన్నారు. ఒక్క టెండర్ వచ్చినా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం ఒక్కో బెడ్‌కు ఇచ్చే ఛార్జీలను రూ.5000 నుంచి రూ.7500 కు పెంచడం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అదనంగా ఏటా రూ.325 కోట్లు అదనంగా ఖర్చు చేస్తుందన్నారు. డైట్ ఛార్జీలను సైతం రెట్టింపు చేశామన్నారు.

దళితబంధు ఉద్యమం..

దేశవ్యాప్తంగా ఈ విధానం మరే రాష్ట్రంలోనూ అమల్లో లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకెళ్తున్నామన్నారు. దళితులకు డబ్బులు పంచడమే కాకుండా సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దళిత బంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో లబ్ధిదారునికి మార్గనిర్దేశం చేస్తున్నట్లు చెప్పారు. నాడు అంబేద్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేశారని కొనియాడారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో 21% ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ g.o 59 విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టెల మీద దళితులు కూర్చున్నట్లు పేర్కొన్నారు. టీఎస్​ఎంఎస్​ఐడీసీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దళితులు కూలి పనులకు మాత్రమే పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్ర్యానికి ముందే అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దళితులకు 16 శాతం ఏజెన్సీలో కేటాయించడం చారిత్రక సందర్భమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో జీవో 59 ద్వారా నీటిపారుదల శాఖ టెండర్లలో 21 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినట్లు వివరించారు. ఇప్పుడు మంత్రి హరీష్ రావు చొరవతో ఏజెన్సీలను కేటాయిస్తున్నామన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లు కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అంబేద్కర్ కల సాకారం చేయలేదన్నారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని సాకారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed