‘దానికి కక్కుర్తిపడే గ్రూపు-1 అభ్యర్థులను రోడ్డున పడేశారు’

by Disha Web Desk 2 |
‘దానికి కక్కుర్తిపడే గ్రూపు-1 అభ్యర్థులను రోడ్డున పడేశారు’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి డీకే అరుణ స్పందించారు. ఈ మేరకు శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం టెండర్ల ప్రక్రియ తప్పా.. ఏ నోటిఫికేషన్ సక్రమంగా జరుగలేదని ఎద్దేవా చేశారు. టీఎస్‌పీఎస్‌సీని వెంటనే ప్రక్షాళన చేయడతో పాటు నైతిక బాధ్యత వహించి చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మద్యం నోటిఫికేషన్లపై ఉన్న శ్రద్ధ.. ఉద్యోగ నోటిఫికేషన్లపై లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. బయోమెట్రిక్ పెడితే ఖర్చు అవుతుందని ప్రభుత్వం కక్కుర్తిపడిందని విమర్శించారు. బయోమెట్రిక్ లేకపోవడంతోనే నిరుద్యోగులు రోడ్డున పడ్డారని తెలిపారు. పోటీ పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్‌సీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపు-1 ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.


Next Story