మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉధృతం.. కవిత యాక్షన్ ప్లాన్ ఇదే!

by Disha Web Desk 4 |
మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉధృతం.. కవిత యాక్షన్ ప్లాన్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో పాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనాపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు రాయనున్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. "మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి... మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు" అని పోస్టర్‌లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed