రాష్ట్రంలోని అన్నదాతలకు తీపికబురు.. సన్న వడ్లకు బోనస్ నిధులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-28 01:36:24  IST  )

గత యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సన్న వడ్లకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి.

రాష్ట్రంలోని అన్నదాతలకు తీపికబురు.. సన్న వడ్లకు బోనస్ నిధులు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సన్న వడ్లకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఈనెలాఖరులోగా బకాయి ఉన్న రైతులకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. స్ధానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు బోనస్​నగదు గుదిబండగా మారింది. దీంతో వారంతా స్ధానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయగా దశలవారీగా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ప్రస్తుత వానాకాలం బోనస్​జమ అవుతుండగా, గత యాసంగి సీజన్​బోనస్​పెండింగ్​పెట్టడంపై అన్నదాతల్లో అనుమానం రేకెత్తింది. ఎగనామం పెట్టే అవకాశం ఉందని భావించి ముందుగా పెండింగ్​బకాయిలు వేసిన తర్వాతే వానాకాలం సన్నాల నగదు వేయాలని డిమాండ్​చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ఈ సీజన్​కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదు. యాసంగి బకాయిలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. దీంతో అధికారులు బకాయిల రైతుల వివరాలు తీసుకుని దశల వారీగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గత యాసంగి సీజన్‌లో 74 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో దొడ్డు 51 లక్షల మెట్రిక్​టన్నులు కాగా, సన్న వడ్లు 24 లక్షల మెట్రిక్​టన్నులు ఉంది. మొత్తం ధాన్యానికి రూ. 17,198 కోట్ల ప్రభుత్వం రైతులకు చెల్లించింది. సన్నాలు పండించిన 4.09 లక్షల మంది రైతులకు రూ. 1159 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు పూర్తి చేసి నాలుగు నెలలు దాటిన బోనస్​పడలేదు.

బోనస్ ​ప్రకటనతో సన్నాల సాగు..

ప్రభుత్వం సన్నాలు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు రైతులకు ప్రోత్సకాలుగా బోనస్​రూ. 500 ప్రకటన చేసింది. దీంతో రైతులు సన్న వడ్లు సాగు చేశారు. నిజామాబాద్​జిల్లాలో 8 లక్షల మెట్రిక్​టన్నులు కొనుగోలు చేస్తే అందులో 7 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే. నల్లగొండ, జగిత్యాల, నిర్మల్, నారాయణపేట, సిద్దపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో పెద్ద మొత్తంలో సన్న వడ్లు పండించారు. ఈ జిల్లాలకు సంబంధించిన రైతులకు సుమారుగా రూ.500 కోట్లు బోనస్​చెల్లించనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో కూడా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం టార్గెట్‌గా​పెట్టుకుంది. అందులో 45 లక్షల మెట్రిక్​టన్నులు సన్నాలే సేకరించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చింది. పేదలకు పంపిణీ చేసే రేషన్​బియ్యంలో తేడా లేకుండా చూడాలని అందుకోసం సన్నాలు ఎక్కువ తీసుకోవాలని సూచించింది. ఈ సీజన్‌కు కొనుగోలు చేసే సన్నాలకు రూ. 2200 కోట్లు అవుతుంది. రెండు సీజన్లకు ప్రభుత్వం రూ. సుమారు రూ. 3500 కోట్లు చెల్లించాల్సి వస్తోంది.

వానాకాలం వడ్ల సేకరణ వేగవంతం..

ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు సంబంధించి వడ్ల సేకరణను పౌరసరఫరాల శాఖ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 25 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం సేకరించింది. నవంబర్​నెలలో 32 లక్షల మెట్రిక్​టన్నులు సేకరణ లక్ష్యంగా ఉండగా గత నెలలో మొంథా తుఫాన్​కారణంగా కొనుగోలు ఆలస్యం జరిగింది. కనీసం 30 లక్షల మెట్రిక్​టన్నులు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ముందుకు వెళ్తుంది. ఆలస్యం చేస్తే ప్రైవేటు వ్యాపారులు రైతులను మభ్యపెట్టి కొనుగోలు చేసి ప్రభుత్వం కేంద్రాలకు రాకుండా కుట్రలు చేస్తారు. అలా జరగకుండా త్వరగా కేంద్రాలకు వచ్చిన ధాన్యం తాలు, తరుగు, రంగు మార్పు వంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు. జనవరిలో పూర్తి చేయాల్సిన ధాన్యం సేకరణ ఈసారి డిసెంబర్‌లోనే 80 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేందుకు సిద్దమైంది.

చెరుకు రైతులకు బోనస్​పై ప్రభుత్వం పరిశీలన..

వరి రైతులకు బోనస్​ఇవ్వడంతో చాలామంది రైతులు సన్నాలు సాగు చేస్తూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేస్తున్నారు. దీంతో సర్కారు పంపిణీ చేసే రేషన్​బియ్యానికి ఇబ్బందులు లేవు. అదే విధంగా చెరుకు రైతులకు కూడా అకాల వర్షాలకు పలు రకాలుగా నష్టపోతున్నామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. స్పందించిన రేవంత్​ప్రభుత్వం సాధ్యసాధ్యాలపై వ్యవసాయ శాఖతో చర్చిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా చెరుకు సాగు విస్తీర్ణం పెంపుదలతో పాటు చక్కెర పరిశ్రమలకు ఊతమివ్వాలని గవర్నమెంట్ భావిస్తోంది. వారం రోజుల కితం చెరుకు రైతులు, పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం నిర్వహించారు. చెరుకు రైతులు, చక్కెర పరిశ్రమల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి శాశ్వత పరిష్కారాలు సూచించేందుకు మంత్రి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Next Story