గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు.. పట్టించుకోని అధికారులు..

by Disha Web Desk 23 |
గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు.. పట్టించుకోని అధికారులు..
X

దిశ, దౌల్తాబాద్: పట్టణాల్లో ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రయితలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో బెల్టుషాపులలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టుషాపులు లేవని అధికారులు చెబుతున్నా అవి లెక్కల వరకే పరిమితమవుతున్నాయి. నూతనంగా ఎక్సైజ్‌ శాఖ మద్యం పాలసీని తీసుకువచ్చి ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా, కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్టుషాపు నిర్వాహకులకు హద్దు లేకుండా పోతుంది. దీంతో వారి వ్యాపారం మూడు క్వార్టర్లు, ఆరు బీర్లుగా కొనసాగుతోంది. దౌల్తాబాద్ మండలంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో ఒకటి నుంచి రెండు బెల్టు షాపులు నిర్వహణ కొనసాగుతుందంటే ఎక్సైజ్‌ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎనీ టైం మద్యం..

గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్టుషాపుల సమయపాలన లేకుండా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లోని కూలి పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుపడి కూలీ పనులకు సైతం పోకుండా నిత్యం గ్రామాల్లో మద్యం మత్తులో ఉంటున్నారు. దౌల్తాబాద్, గోక పసుల బాద్ ప్రాంతాల వైన్స్ షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాలకు తీసుకువెళ్లి ఒక మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ రేటు కంటే రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..

గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్‌గా మారడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. హోటళ్లు, కిరాణా షాపులు బెల్ట్ షాపులు గా తయారవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జన ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. మద్యం షాపులను రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా వెళ్లడించినప్పటికి గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నా సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

నిషేధం బుట్టదాఖలు..

గ్రామాల్లో మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు అనారోగ్యం పాలవడం తో పాటు కుటుంబాలు అప్పుల కొరల్లో చిక్కుకోవడం,గొడవలు వంటి సంఘటనలు చోటు, చేసుకోవడంతో దౌల్తాబాద్ మండలంలోని చంద్రకల్ వంటి గ్రామాల్లో మద్యం నిషేధిస్తూ గ్రామస్తులంతా తీర్మానించారు. సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. ఎక్సైజ్‌ అధికారులు నిషేధిత గ్రామాల వైపు చూసిచూడనట్లు వ్యవహరించడంతో మూడు నెలల్లోనే మద్యం అమ్మకాలు పునఃప్రారంభమవడంతో నిషేద తీర్మానాలు బుట్ట దాఖలయ్యాయి.

నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి..

గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించడం వలన మద్యానికి బానిసైన కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడుతున్నాయి. చేసిన కష్టమంతా తాగుడికే ధారపోస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి ఆకర్షితులవుతున్నారు. గ్రామాల్లో ఎక్కువగా ప్రజల మధ్య అల్లరులు, గొడవలు జరగడానికి మద్యం కారణమవుతోంది. బెల్టుషాపుల నిర్వాహకులపై ఎక్సైజ్‌ అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారో వేచిచుడాలి.


Next Story

Most Viewed