రేవంత్, బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. రూ.100 కోట్ల పరువునష్టం దావా

by Disha Web Desk 2 |
రేవంత్, బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. రూ.100 కోట్ల పరువునష్టం దావా
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీల అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ మంగళవారం లీగల్ నోటీసులు పంపారు. టీఎస్ పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతో తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికీ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారు.

కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారిపైన అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదని పేర్కొన్న కేటీఆర్, ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం రూ.100 కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్ల రూపాయల పరువునష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులు కేటీఆర్ ప్రస్తావించారు.



Next Story

Most Viewed