జిల్లా రాష్ట్రానికే ఆదర్శం కావాలి..రైతుల ఖాతాల్లోకి గంటల్లో డబ్బులు: మల్లారెడ్డి

by Dishafeatures2 |
జిల్లా రాష్ట్రానికే ఆదర్శం కావాలి..రైతుల ఖాతాల్లోకి గంటల్లో డబ్బులు: మల్లారెడ్డి
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్‌లో జెడ్పీ ఛైర్మన్ మలి పెద్ది శరత్ చంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని విజయవంతం చేయడంలో జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు.

విద్యా, ఆరోగ్య రంగాల్లో జిల్లా దూసుకుపోతుందన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మరో 230 పడకలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఘట్కేసర్, మేడ్చల్‌లో డయాలసిస్ కేంద్రాలు ప్రజల అవసరాలను తీర్చనున్నట్లు తెలిపారు.శామీర్ పేట, ఘట్‌కేసర్‌లలో పోస్టుమార్టం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అల్వాల్ ప్రాంతంలో రూ. వెయ్యి కోట్లతో 28 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్)ను నిర్మించేందుకు భూమి పూజ చేసినట్లు తెలిపారు.

మన ఊరు – మన బడి పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు రూ.7,200 కోట్లు మంజూరు చేసి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో కూడా పాఠశాలలను అభివృద్ధి చేసి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన డెబ్బై రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తోందన్నారు.


ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమించి ఎంతో బాగా పని చేశారని వారిని మంత్రి అభినందించారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో 19 మనవేనన్నారు. 10 కి 10 ఆదర్శ గ్రామాలు కూడా మన పల్లెలే నిలువడం గర్వకారణమన్నారు. 5వ విడత పల్లె ప్రగతి ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని, అధికారులు ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలని మంత్రి మల్లారెడ్డి ఆకాక్షించారు.

అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ...రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో ఉండాలన్నారు. పల్లె ప్రగతిలో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలని శరత్ చంద్రారెడ్డి కోరారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని అందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవనం, అటవీ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, సివిల్ సప్లై తదితర శాఖల అధికారులు నివేదికను సమర్పించారు. ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సమాధానమివ్వడంతోపాటు అందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, జెడ్పి వైస్ చైర్మన్, బెస్త వెంకటేష్, ఎంపీపీలు, జడ్పీటీసీలు,కో అప్షన్ సభ్యులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed