గర్భిణులకు త్వరలో న్యూట్రీషన్ కిట్ పథకం: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
గర్భిణులకు త్వరలో న్యూట్రీషన్  కిట్ పథకం: మంత్రి హరీష్ రావు
X

దిశ, అందోల్: మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించేంత వరకు ఆరోగ్యవంతంగా ఉండేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం త్వరలో న్యూట్రిషన్‌ కిట్స్‌ పథకాన్ని ప్రవేశపేట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. ఇప్పటికే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నామని, ప్రసవించిన తర్వాత కేసీఆర్‌ కిట్‌ను అందజేస్తున్నామన్నారు. బుధవారం అందోలు మండలంలో పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు, బీఆర్‌ఎస్‌ అత్మీయ సమ్మేళానానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గృహలక్ష్మీ పథకం కింద ఇచ్చే నిధులు మహిళల పేరు మీద ఇస్తున్నామన్నారు. అందోలు నియోజకవర్గంలో కరెంట్‌ కష్టాలు లేవని, నీళ్లకు లోటు లేకుండా చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం బోర్ల కాడ మీటర్లు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పార్టీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనని ఆయన విమర్శించారు.

ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని, ప్రజలు సద్వినియోగం చేసుకొవాలని ఆయన సూచించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని ఆయన తెలిపారు. మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ భవనాన్ని మంజూరు చేయాలని స్థానిక దళిత సంఘాల నాయకులు ఆయనను కలిసి కోరారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మార్క ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాహుల్ కిరణ్, ఎం.భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఎంపీపీ బాలయ్య, వైస్ ఎంపీపీ మహేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ డేవిడ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు పి.నారాయణ, గంగా జోగినాథ్, డీబీ.నాగభూషణం, మల్లికార్జున్, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

పైసా భారం లేకుండా డబుల్‌ బెడ్ రూంలు..

ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడంటూ పెద్దలు ఊరికే అనలేదని, ఈ రెండింటిలో ఏది చేసినా ఎంతో కొంత అప్పు మనపై పడుతుందన్నారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక నిరుపేదల సొంతింటి కలను ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం పడకుండా నేరవేరుస్తుందన్నారు. అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని మూడు చోట్లలో నిర్మించిన 576 డబుల్‌ బేడ్‌ రూం ఇళ్లను ఆయన ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి గహ ప్రవేశాలు చేశారు. ఆయా డబుల్‌ బేడ్‌ రూం కాలనీల వద్ద నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని అందుకు అవసరమైన నిధులను తాను మంజూరు ఇస్తానని ప్రకటించారు. డబుల్‌ బెడ్‌ రూంలు అందని వారు ఆధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనలోనే సింగూర్‌ కాలువ పనులు..

ఉమ్మడి మెదక్‌ జిల్లాకు తలమానికంగా ఉన్న సింగూర్‌ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లా ప్రజల హక్కు అని మంత్రి అన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ సింగూర్‌ కాలువ పనులు పూర్తి చేయించలేకపోయారని, బీఆర్‌ఎస్‌ పాలన వచ్చాక కాలువల పనులను పూర్తి చేయించి, అందోలు నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు నీటీని అందించామన్నారు. అదే విధంగా తాలెల్మ ఎత్తిపోథల పథకం పనులను పూర్తి చేసి, 10 వేల ఎకరాలకు నీటిని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయని, రెండు పంటలను పండిస్తున్నారన్నారు. ఈ సారి కూడా వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మున్సిపల్‌ అభివద్దికి రూ.25 కోట్లు..

అందోలు–జోగిపేట మున్సిపల్‌ అభివద్దికి సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లను మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఈ నిధులతో పట్టణంలోని మురికి కాలువలు, సీసీ రోడ్లను, కమ్యూనిటీ భవనాలను నిర్మాణాలను చేపట్టుకొవచ్చునని తెలిపారు. ఈ నిధులతో పట్టణంలో ఏలాంటి సమస్యలున్నా తీర్చుకునేందుకు అవకాశం ఉందన్నారు.

జోగిపేటలో డయాలసిస్ సెంటర్..

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికోసం జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారంతా సంగారెడ్డి హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా మన జోగిపేటలోని డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. వారానికి రెండు సార్లు చొప్పున డయాసిస్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అభివద్ధి పనులకు శంఖుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు

అందోలు, పుల్కల్, చౌటకూర్, మునిపల్లి మండలాలకు చెందిన జర్నలిస్టులకు సంగుపేట వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఇళ్ల పట్టాలను మంత్రి పంపీణీ చేశారు. జోగిపేటలోని అంబేద్కర్‌ విగ్రహాన్ని అవిష్కరించారు. అందోలులోని వడ్డెర కాలనీ, గూడెం వద్ద నిర్మించిన డబుల్‌ బేడ్‌ రూం ఇళ్లను ప్రారంభించారు. అందోలులోని బస్తీ దవాఖానాను ప్రారంభించారు. స్వామి వివేకానంద విగ్రహం వద్ద యోగా సెంటర్‌ ఏర్పాటుకు శంఖుస్థాపన చేశారు. అందోలు నుంచి జోగిపేట వరకు జాతీయ రహాదారి వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. అందోలు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో అత్మీయ సమ్మేళానాన్ని నిర్వహించారు.

జోగిపేటలో రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. పునరుద్ధరణ చేసిన క్లాక్‌ టవర్‌ను ప్రారంభించారు. అందోలు చెరువు సుందరీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. జోగిపేటలో రూ.60లక్షలతో నిర్మించ తలపెట్టిన బహద్దూర్‌ఖాన్‌ ఫంక్షన్‌ హాలు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. జోగిపేటలోని మల్లన్న కాలనీ సమీపంలో నిర్మించిన డబుల్‌ బేడ్‌ రూం ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి గహ ప్రవేశాలు చేయించారు.

Next Story

Most Viewed