తెలంగాణలో మోదీ ప్రభంజనం

by Disha Web Desk 22 |
తెలంగాణలో మోదీ ప్రభంజనం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో మోదీ ప్రభంజనం ఆరంభమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను బీజేపీ దక్కించుకోవడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం బిజెపి అభ్యర్థి డీకే అరుణ, తదితర ముఖ్య నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ దేశానికి ప్రధాని ఎవరు కావాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ, మిత్రపక్షాలు కలిసి 400కు పైగా సీట్లు సాధించడం ఖాయం అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్‌కు అభ్యర్థులు దొరకడం లేదు.. దొరికిన గెలుస్తామన్న నమ్మకం లేదు . అందుకే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్ చేస్తే రెస్పాండ్ కూడా కావడం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాతో గెలవలేదు. కేవలం కేసీఆర్ ప్రభుత్వం పై ఉన్న కోపంతో ప్రజలు ఆ పార్టీని గెలిపించారు అని కిషన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేసింది లేదు. కేవలం హామీలు.. మాటలతో ప్రజలను మోసం చేశారని కిషన్ రెడ్డి చెప్పారు. రైతుల రుణమాఫీ, మహిళలకు రుణాలు, రేషన్ కార్డులు వీటికి అతిగతి లేదు అని కిషన్ రెడ్డి చెప్పారు.

గతంలో రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ చేసినట్లు గాని ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని, ఒక్క హామీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదని కిషన్ రెడ్డి చెప్పారు. అప్పుడు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే .. ఇప్పుడు రాహుల్ గాంధీ టీం దోచుకుంటుంది అని కిషన్ రెడ్డి ఆరోపించారు. గెలిపించిన పాపానికి తెలంగాణ ప్రజలు ఆర్‌జి టాక్స్ చెల్లించవలసిన పరిస్థితి నెలకొంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరంలో అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతామని, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు నోరు మెదపడం లేదు అని ఆరోపించారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోరితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని కిషన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎంపీ ఎన్నికల సందర్భంగా రైతులు, మహిళలు, యువకులు, నిరుపేదలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండా చేసుకొని ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలను గెలిచి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ స్థానం నుంచి కూడా గెలుస్తామని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు, నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాలను గెలుస్తామని.. భారీ మెజారిటీని ఇవ్వవలసిన బాధ్యత ఆయన నియోజకవర్గాల ప్రజల పై ఉందని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర నేతలు నాగూర్ నామాజీ, పద్మజా రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, శ్రీ వర్ధన్ రెడ్డి, పాండురంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పాండురంగారెడ్డి, వీర బ్రహ్మచారి, సుదర్శన్ రెడ్డి, ఎగ్గని నరసింహులు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed