కంటి వెలుగు సక్సెస్.. 2.94 లక్షల మందికి అద్దాలు పంపిణీ: CS శాంతి కుమారి

by Disha Web Desk 19 |
కంటి వెలుగు సక్సెస్.. 2.94 లక్షల మందికి అద్దాలు పంపిణీ: CS శాంతి కుమారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కంటి వెలుగు సక్సెస్​అయిందని, పేదల కళ్లల్లో వెలుగులు నిండుతున్నాయని సీఎస్​శాంతికుమారి పేర్కొన్నారు. సోమవారం బీఆర్ కేఆర్ భవన్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో కంటి వెలుగు, ఉపాధ్యాయుల బదిలీలు, మన ఊరు- మన బడి, ఆయిల్ ఫామ్, కొత్తగా ప్రారంభించుకున్న కలెక్టరేట్లలో కార్యాలయాల నిర్వహణ తదితర అంశాలపై ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్​మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 507 గ్రామ పంచాయితీలు, 205 మున్సిపల్ వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు పూర్తి చేసి 12.29 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు.

2,94,462 మందికి రీడింగ్ గ్లాసులను అందచేయడంతోపాటు 2,05,334 మందికి కొత్తగా కళ్లద్దాలు తయారీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. కంటి వెలుగులో ఇప్పటి వరకు ప్రతీ రోజూ సుమారుగా 2 లక్షల మందికి పరీక్ష చేసి, 50,000 కళ్ళద్దాలను ఉచితంగా అందించామని వెల్లడించారు. అయితే క్యాంపులలో నిర్వహించే పరీక్షల వివరాలను మెడికల్ రికార్డులలో ఏవిధమైన పొరపాట్లు లేకుండా నింపాలని ఆమె సూచించారు. ఈ విషయంలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీల ద్వారా తనిఖీ చేయించాలని సూచించారు.

పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు..

సుదీర్ఘ కాలం తర్వాత చేపట్టే ఉపాధ్యాయ బదిలీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో పూర్తి చేయాలని సీఎస్​శాంతి కుమారి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు చేపట్టిన ఈ బదిలీల ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని పేర్కొన్నారు. పూర్తిగా ఆన్ లైన్ విధానం ద్వారా జరిపే ఈ బదిలీల ప్రక్రియపై ఉపాధ్యాయుల నుండి అందే ఫిర్యాదులు, దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవియన్స్ రిడ్రెసల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటివరకు 53 వేల దారఖాస్తులు అందాయని, ఇవి 75 వేల వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రతి రోజూ జిల్లా విద్యా శాఖాధికారులతో సమీక్షించాలని సీఎస్​కోరారు.

ఫిబ్రవరి 1 వ తేదీ నుండి మన ఊరు-మన బడి స్కూళ్లు షురూ..

రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, బోధనేతర పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పనపై చేపట్టిన మన ఊరు - మనబడి కార్యక్రమంలో పూర్తైన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ప్రారంభించాలని సూచించారు. ప్రారంభోత్సవాలు పండుగ వాతావరణంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో అగ్రగామిగా తెలంగాణా

రాష్ట్రంలో ఇప్పటివరకు 57 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్​​ప్లాంటేషన్ ను చేపట్టడం ద్వారా దేశంలోనే ముందంజలో ఉన్నామని సీఎస్​ వివరించారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో మరో 60 వేల ఎకరాలలో ప్లాంటేషన్ జరుగుతోందని, ఈ మార్చి వరకు లక్ష్యాన్నిసాధించాలని కలెక్టర్లకు సూచించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించుకున్న 17 నూతన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ లకు అని ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలన్నారు.

ప్రజల సౌకర్యార్ధం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే భవనం లో ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశ్యమన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యా శాఖ కమీషనర్ దేవసేన, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మొహంతి, ఎస్.సి డెవలప్మెంట్ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఉద్యానవన శాఖ ఇంచార్జ్ కమీషనర్ హనుమంత రావు, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed