మంత్రి ఎర్రబెల్లిని ఆర్.ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీకి ఫిర్యాదు

by Disha Web Desk 16 |
మంత్రి ఎర్రబెల్లిని ఆర్.ఎస్ ప్రవీణ్  సంచలన వ్యాఖ్యలు.. సీఈసీకి ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి ఎర్రబెల్లిని ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేస్తూ లేఖ విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు పథకాలన్నింటికీ బీఆర్ఎస్‌కి ఓట్లు వేసే వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనని ఆయన ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకొని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.

మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు తెలిపే గ్రామాల్లో దళిత బంధు కేటాయించి ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపని ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు, హింసలు సృష్టించేలా వివాదాస్పదంగా లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేసి విడుదల చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఏదోలా ఎన్నికల్లో పబ్బం గడుపుకునే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. అందంగా ఉన్న తెలంగాణలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీఆర్ఎస్ నీచపు బుద్ధి మానుకోవాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



Next Story