పెసా చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలి : బండారు దత్తాత్రేయ

by Disha Web Desk 15 |
పెసా చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలి : బండారు దత్తాత్రేయ
X

దిశ, ముషీరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెసా చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. శ్యామ్ ప్రసాద్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలో నిర్వహిస్తున్న కుమరం భీం స్టడీ సర్కిల్ కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. కుమరం భీం, భారత మాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గవర్నర్ మాట్లాడుతూ గోండులకు విద్యా, ఉద్యోగ అవకాశాలు రాకుండా పోతున్నాయని, వచ్చినా.. వివిధ కారణాల రీత్యా సద్వినియోగం చేసుకోలేకపోతున్నట్టు తెలియజేశారు. జీవితంలో అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం ప్రముఖమైనవని అన్నారు. ఆదివాసీలు మాట్లాడుకునే గోండు భాషను అభివృద్ధి చేయాల్సిన అవసరం ప్రభుత్వాల పైనే ఉందన్నారు.

సివిల్స్ తదితర పోటీ పరీక్షలను మాతృభాషలో రాసిన వారు ఖచ్చితంగా క్రాక్ చేస్తారన్నారు. శ్యామ్ ప్రసాద్ ఇనిస్టిస్ట్యూట్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో కుమరం భీం స్టడీ సర్కిల్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆదివాసీ గిరిజన విద్యార్థుల కోసం రూ. 21 లక్షలు విరాళాన్ని గవర్నర్ దత్తాత్రేయ ప్రకటించారు. అటవీ సంపద ఆదివాసీ గిరిజనులకే చెందాలని, 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సిద్దించి అమృత కాలం అవుతున్న సమయానికి గిరిజనులు పూర్తి స్థాయి అధికారాలు సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కుమరం భీం స్టడీ సర్కిల్ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు, భవన నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. సిన్ చైర్మన్ రెడ్డి, కార్యదర్శి కొండల్ రావు, కుమరంభీం స్టడీ సర్కిల్ అధ్యక్షులు డాక్టర్ మధుకర్, ఉపాధ్యక్షులు మిశ్రం నాగోరావు పాల్గొన్నారు.



Next Story

Most Viewed