బ్యాంక్ లపై ప్రభావం చూపని రూ.2000 నోట్ల ఉపసంహరణ..

by Disha Web Desk 20 |
బ్యాంక్ లపై ప్రభావం చూపని రూ.2000 నోట్ల ఉపసంహరణ..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వాటి ప్రభావం బ్యాంక్ లపై ఏ మాత్రం పడలేదు. 2016లో రూ. 1000, రూ.500 నోట్లను రద్ధు చేసిన సమయంలో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా బ్యాంక్ లు అన్ని నోట్లు మార్పిడి చేసుకునే వారితో కిటకిటలాడాయి. నెలల తరబడి బ్యాంక్ లలో రద్ధీ తగ్గకపోగా దాని ప్రభావం బ్యాంక్ లు అందించే ఇతర సేవలపై సైతం పడ్డాయి.

తాజాగా ఆర్బీఐ రెండు వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించి సెప్టెంబర్ నెలాఖరు వరకు గడువు విధించింది. మంగళవారం నుండి అన్ని బ్యాంక్ లలో నోట్ల మార్పిడి చేసుకోవచ్చని చెప్పింది. బ్యాంక్ ఖాతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు గరిష్టంగా పది రెండు వేల నోట్లు అంటే రూ 20 వేల వరకు మార్చుకోవచ్చని ప్రకటించింది. దీంతో అన్ని బ్యాంక్ లలో రెండు వేల నోట్ల మార్పిడి కోసం వచ్చిన వారితో రద్ధీగా ఉంటాయని భావించారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా మొదటి రోజు నోట్ల మార్పిడికి అంతంత స్పందన మాత్రమే వచ్చింది.

బంగారం కొనుగోలు కోసం..

బ్యాంక్ లలో పెద్ద మొత్తంలో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి జరిగితే ఆదాయ పన్ను శాఖ అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉండడంతో పెద్ద మొత్తంలో నోట్లు ఉన్నవారు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ఊతమిచ్చేలా మంగళవారం కొన్ని బంగారు ఆభరణాల విక్రయాల దుకాణాలలో కొంత రద్ధీ కన్పించింది. అయితే 24 క్యారెట్ల బంగారం విక్రయాలకు పేరొందిన ప్రాంతాలైన కోఠి, బేగంబజార్, అబిడ్స్, సికింద్రాబాద్, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాలలో వ్యాపారులు 10 గ్రాముల బంగారానికి సుమారు ఐదు నుండి ఆరు వేల రూపాయలను అధికంగా తీసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం ఇప్పుడు అధికారులకు పెద్ద టాస్క్ గా మారింది. ఇదేకాకుండా కొంతమంది రెండు వేలనోట్లు ఉన్నాయి తీసుకుంటారా ? అంటూ బ్లాక్ మార్కెట్ లో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

నిరాకరిస్తున్న చిరు వ్యాపారులు..

రూ 2 వేల నోట్లను తీసుకునేందుకు చిరు వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు. అంత మొత్తానికి తిరిగి ఇచ్చేందుకు చిల్లర లేకపోవడం, నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంక్ లకు వెళ్లి క్యూ లైన్లలో నిల్చుని మార్చుకోవాల్సి రావడం వంటి ఇబ్బందులు పడాల్సివస్తుందని నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కొంతమంది ఏకంగా రెండు వేల నోట్లు తీసుకోబడదు అంటూ బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు. చిన్న హోటల్స్, కిరాణా దుకాణాలు, రెడీమేడ్, ఫుట్ పాత్ వ్యాపారులు, టీ స్టాళ్లు, టిఫిన్ బండ్లు , పండ్ల వ్యాపారులు ఇలా చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారు రూ 2 వేల నోట్లను తీసుకోకపోవడంతో వారి వ్యాపారాలు కూడా కొంత మేర తగ్గిపోయాయి .



Next Story

Most Viewed