తెలంగాణలో 25 వేల పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి

by Disha Web Desk 15 |
తెలంగాణలో 25 వేల పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి
X

దిశ, ముషీరాబాద్ : పోరాడి సాధించుకున్న తెలంగాణలో డీఎస్సీని ప్రకటించకుండా పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని పలువురు నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 25వేల టీచర్​ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఐదు వేల పోస్టులను ప్రకటించి ప్రభుత్వం బాధ్యతనుంచి తప్పించుకుంటుందని విమర్శించారు. డీఎస్సీ పరీక్షలను నాలుగు నెలలు వాయిదా వేయాలని, మొత్తం 25 వేల పోస్టులను భర్తీచేయాలని డిమాండ్​ చేస్తూ నిరుద్యోగ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, టీజేఎస్​ అధ్యక్షులు ఆచార్య కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్​కుమార్ పాల్గొని మద్దతు పలికారు.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకే డీఎస్సీ నోటిఫికేషన్​ తూతూ మంత్రంగా జారీ చేసిందన్నారు. గత మార్చి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్​ విద్యాశాఖలో 13086 టీచర్​ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి నోటిఫికేషన్​ విషయం మరిచారని విమర్శించారు. ఆచార్య కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీ లేక పోవడంతో విద్యార్థులకు కనీస విషయ పరిజ్ఞానం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల పాఠశాలల్లో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్​ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు పరిజ్ఞానం సంపాదించలేక వెనుకబడిపోతున్నారన్నారు. టీచర్ పోస్టుల భర్తీని బడ్జెట్​ ఖర్చు అవుతుందనే కోణంలో

చూడకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, బడ్జెట్​ భవిష్యత్​తరాల అభివృదధికి ఖర్చుచేస్తున్నామని ప్రభుత్వం భావించాలన్నారు. ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ ప్రభుత్వం టీచర్​ పోస్టులను భర్తీ చేయకుండా విద్యను నిర్వీర్యం చేసే కుట్రను చేస్తుందని ఆరోపించారు. డీఎస్సీ పరీక్షను నాలుగు నెలలు వాయిదా వేసి అభ్యర్థుల ప్రిపరేషన్​కు సమయం ఇవ్వాలన్నారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్​ నీల వెంటకేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్​ గుజ్జకృష్ణల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాయకులు రాంమోహన్, శివకృష్ణ, నందగోపాల్, ప్రదీప్​ తదితర నిరుద్యోగులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed