రాజకీయంగా రిస్క్ అయినా కేసీఆర్ తగ్గలే.. KTR కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రాజకీయంగా రిస్క్ అయినా కేసీఆర్ తగ్గలే.. KTR కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయంగా రిస్క్ తీసుకుని మరి కేసీఆర్ దళిత బంధు, బీసీ బంధు పథకాలను అమలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సంఘం కోసం సమాజం కోసం పని చేసి శాశ్వతమైన ఖ్యాతిని సాధించుకున్న గొప్ప మహా మనిషి జ్యోతిబాపూలే అని గుర్తు చేశారు. 197 సంవత్సరాల క్రితం జన్మించిన పూలే గారు ఎంచుకున్న మార్గం ఆయన బోధనలు ఇప్పటికీ కూడా అందరికీ ఆచరణీయమన్నారు.

విద్యతోనే అనే వికాసం వస్తుంది అని బలమైన నమ్మకంతో తన ఇంటి నుంచే మార్పు మొదలుపెట్టి ముందుకు సాగిన గొప్ప వ్యక్తి పూలే అని పేర్కొన్నారు. తన సతీమణి సావిత్రిబాయికి పాఠాలు చెప్పి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఇద్దరు కలిసి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారన్నారు. విద్యతోనే వికాసం వికాసం‌తోనే సమానత్వం అన్న పూలే గారి ఆలోచనలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా గురుకుల పాఠశాలలను పెట్టి విద్యను అందించామన్నారు. ఒక్కో విద్యార్థిపైన రూ.1,25,000 ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి విద్య అందించామని తెలిపారు.

మహాత్మా జ్యోతిబాపూలే చెప్పిన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం కొనసాగిందని తెలిపారు. ప్రతి పాఠశాలను ఇంటర్మీడియట్ కాలేజీకి అప్ గ్రేడ్ చేశామని.. బీసీ విద్యార్థుల కోసం 33 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టామన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే పేరుతో రూ.20 లక్షల రూపాయల ఓవర్సీస్ ఫెలోషిప్‌ను అందించామన్నారు. ఈ విషయంలో దళిత గిరిజన బహుజన అగ్రవర్ణ పేదలు అన్న వివక్ష చూడలేదని తెలిపారు. టాటాలు, బిర్లాలు ముఖ్యమే కాదు తాతలనాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని ఆచరణాత్మకంగా వాటికి ఒక కొత్త రూపుని గౌరవాన్ని అందించామన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు జ్యోతిబాపూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని పేర్కొన్నారు.

Next Story

Most Viewed