కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలనలో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి: ఎమ్మెల్యే రాజాసింగ్

by Disha Web Desk 12 |
కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలనలో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి: ఎమ్మెల్యే రాజాసింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన గత సీఎం కేసీఆర్ పాలన ఒకేలా ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశారు. చెంగిచెర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తానని ప్రకటించిన నేపథ్యంల్ రాజాసింగ్‌ను పోలీసులు వెళ్లనివ్వకుండా గురువారం హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వీడియో రిలీజ్ చేశారు. హిందువులపై కొందరు దాడి చేశారని, బాధితుల వద్దకు వెళ్దామనుకున్నా.. కానీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారన్నారు. ఎంఐఎం నేతలు, ఇతర నేతలు వెళ్లొచ్చు.. కానీ తాము వెళ్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా నిందితులపై కాకుండా బాధితులపై పోలీసులు వన్ సైడ్ యాక్షన్ తీసుకున్నారని రాజాసింగ్ ఫైరయ్యారు.

కేసీఆర్ ఎనిమిదో నిజాం అని, ఆయన ఆవిధంగానే ప్రొజెక్ట్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనకు.. రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదని ఆయన ఫైరయ్యారు. కేసీఆర్ హయాంలో జరిగినట్లు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తే ఇవాళ చేయొచ్చుని, రేపో.., ఇంకోరోజో.. చేయలేరు కదా అని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఏమవుతుందనేది ఆలోచించుకోవాలని హెచ్చరించారు. బాధితులపై రివర్స్ కేసులు పెట్టడం దారుణమని, హిందువులపై వందల మంది దాడి చేయడం అన్యాయమని రాజాసింగ్ పేర్కొన్నారు. హిందువులపై పెట్టిన కేసులు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed