కేంద్రం వెంటనే బీసీల కులగణన చేపట్టాలి: MP ఆర్ కృష్ణయ్య డిమాండ్

by Disha Web Desk 19 |
కేంద్రం వెంటనే బీసీల కులగణన చేపట్టాలి: MP ఆర్ కృష్ణయ్య డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ సంఘాల సమస్యల పరిష్కారానికి కేంద్రం వెంటనే కుల గణన నిర్వహించాలని.. అదేవిధంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య నేతృత్వంలో వెనుకబడిన తరగతుల నాయకులు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. శుక్రవారం కేంద్రమంత్రిని కలిసిన బీసీ నేతలు చర్చలు జరిపినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. 75 ఏళ్లుగా ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాతినిథ్యం సహా అన్ని రంగాల్లో బీసీలకు న్యాయమైన వాటా దక్కకుండా పోయిందని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంగా, అన్ని సామాజిక కులాలకు వారి జనాభా ఆధారంగా తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించడం చాలా కీలకమని వ్యాఖ్యానించారు.

బీసీల విషయంలో విస్మరించబడిన సూత్రం

దేశ సంపదలో ఉత్పత్తికి వెన్నెముకగా ఉంటూ దోహదపడుతున్నప్పటికీ, బీసీలకు సరైన వాటా దక్కకుండా పోయిందన్నారు. దేశ బడ్జెట్‌లో, రాజకీయ అధికారంలో తగిన వాటా అందకుండా పన్నుల భారాన్ని మోస్తున్నారన్నారు. దేశంలో ఐక్యత, సమగ్రత మరియు శాంతిని పెంపొందించడానికి బీసీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరంతర అన్యాయాన్ని పరిష్కరించడం అవసరమని అన్నారు.

బీసీల విషయంలో పాలకులు సరైన రీతిలో వ్యవహరించకుండా మౌలికంగా సూత్రాన్ని విస్మరించారని తెలిపారు. గత 75 ఏళ్లలో రాజకీయ రంగంలో బీసీ ప్రాతినిధ్యం 14 శాతానికి మించలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. ఇందులో కేంద్ర మంత్రి వర్గం, రాష్ట్ర మంత్రి వర్గం, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీలు మరియు కౌన్సిల్‌లలో ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న అన్యాయంపై బీసీలకు అవగాహన ఉందని కృష్ణయ్య అన్నారు.

బీసీల బడ్జెట్ పెంపునకు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కృషి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాటా కల్పించడం ఇప్పటికే ప్రారంభమైందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. స్వయంగా బీసీ అయిన ప్రధాని బీసీ వర్గానికి 27 మంత్రిత్వ శాఖలను కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీసీల డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొంటూ.. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీల బడ్జెట్ పెంపునకు తనవంతు కృషి చేస్తానని పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed