రాహుల్​గాంధీ మెప్పు కోసం మోడీపై సీఎం రేవంత్​రెడ్డి విమర్శలు

by velandi.Saikiran |

సీఎం రేవంత్​రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు, రాహుల్ గాంధీకి ద‌గ్గరై కాంగ్రెస్ హైక‌మాండ్ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మహేశ్వర్​రెడ్డి మండిపడ్డారు.

రాహుల్​గాంధీ మెప్పు కోసం మోడీపై సీఎం రేవంత్​రెడ్డి విమర్శలు
X

రాహుల్​గాంధీ మెప్పు కోసం పీఎం మోడీపై సీఎం రేవంత్​రెడ్డి విమర్శలు

ఉపాధి హామీ పథకంపై ఆరోపణలు చేసి హైకమాండ్​వద్ద చక్రం తిప్పాలని ప్లాన్​: బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్​రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు, రాహుల్ గాంధీకి ద‌గ్గరై కాంగ్రెస్ హైక‌మాండ్ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే ఆశ‌తోనే ఉపాధి హామీ ప‌థ‌కం వీబీ జీ రామ్​చ‌ట్టంగా బ‌లోపేతం చేసిన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి మండిపడ్డారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే రాజ్యాంగాన్ని ర‌ద్దు చేస్తార‌నే త‌ప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ మ‌హారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి దారుణంగా ఓడిపోయింది. బిజెపిని బ్రిటీష్ జ‌న‌తా పార్టీ అన‌డానికి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని, బిజెపి పేరులోనే భార‌తీయ‌త ఉందని, జాతీయ కాంగ్రెస్​పార్టీ స్ధాపించిందని అంగ్లేయుడు ఏఓ హూమ్​అనే సంగతి మరిచిపోవద్దన్నారు.

కాంగ్రెస్ అనే ప‌దంలో భార‌తీయ‌త లేదని అది బ్రిటీషోళ్లు పెట్టిన పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ కాస్తా ఇపుడు ఇస్లామిక్ నేష‌న‌ల్ కాంగ్రెస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల ప్రచారంలోనే కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటూ మాట్లాడారు. అందుకే ఇస్లామిక్ నేష‌న‌ల్ కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పేరు మార్చారని గుర్తు చేశారు. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ప్రక్షాళన చేపడుతూ ప్రత్యేక సమగ్ర సమీక్ష (SIR) ‌కార్యక్రమాన్ని నిర్వహించడం దేశంలో నిత్యం జరిగే పక్రియే. దేశంలో ఇప్పుడే మొదటిసారిగా సర్​‌ప్రక్రియ చేపడుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడ‌డం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓట్లను తొల‌గిస్తున్నారని ఆరోపిస్తూ ఓట్ చోర్ అనే నినాదంతో హ‌డావుడి చేసిన రాహుల్ గాంధీకి బీహార్ రాష్ట్ర ప్రజ‌లు చెంప చెళ్లుమ‌నిపించే తీర్పు ఇచ్చారు. అయినా కాంగ్రెస్ నేత‌ల‌కు బుద్ధి రాలేదు. ఓట్లను తొల‌గిస్తున్నారని ఆరోపించిన రాహుల్ గాంధీ ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల జాబితాను ప్రక్షాళ‌న చేసేందుకు సర్​ప్రక్రియ‌ను చేప‌డితే కూడా త‌ప్పుప‌ట్టారు.

ఇది ఆయన ద్వంద్వ ప్రమాణాల‌కు నిద‌ర్శనమన్నారు. లోక్​స‌భ ఎన్నిక‌ల్లో బీహారులో బిజెపికి వ‌చ్చిన ఓట్ల కంటే సర్​ప్రక్రియ అమ‌లు త‌ర్వాత వ‌చ్చిన ఓట్లు స్వల్పంగా త‌గ్గాయి. అదే ఆర్​జెడీ కి స్వల్పంగా పెరిగాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ విశ్లేషణ‌లు, ఓట్ షేర్ గ‌ణాంకాల‌ లెక్కల‌న్నీ మీడియాలో వ‌చ్చాయి. ఇన్ని రుజువులు ఉన్నా కాంగ్రెస్ నేత‌లు త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వతంగా వ‌ల‌స వెళ్లిన‌వారివి, డూప్లికేట్ కేట‌గిరీ వంటి కార‌ణాల‌తో ఓట్లు తొల‌గిస్తుంటే ప్రజ‌ల‌కు ఎలాంటి న‌ష్టం క‌లుగుతోందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్​చేశారు. విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ -2047 విజ‌న్ డాక్యుమెంట్ తెచ్చింద‌ని అసెంబ్లీలో మంత్రులు చెప్పారు. ప్రస్తుతం విక‌సిత్ భార‌త్ కాదు సంక్షోభ భార‌త్ అంటూ విమ‌ర్శించ‌డం అర్ధపర్ధం లేదన్నారు. సర్​ప్రక్రియ‌ను వీబీ జీ రామ్​జీ చ‌ట్టాన్ని వ్యతిరేకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే ఇదే అంశంపై తెలంగాణ‌లో కాంగ్రెసుకున్న ఎనిమిది మందితో లోక్ సభ ఎంపీల‌ను రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌వాల్ విసిరారు.

Next Story