తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం.. బలగం సినిమాను మించిన సీన్!

by Disha Web Desk 2 |
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం.. బలగం సినిమాను మించిన సీన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఉప్పు నిప్పు మాదిరిగా ఉన్న సీనియర్ నేతలు తాజాగా బలగం సినిమా రేంజ్‌లో కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నల్గొండలో శుక్రవారం నిర్వహించిన నిరుద్యోగ నిరసన దీక్ష రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్ సహా నేతలంతా ఐక్యత రాగం ఆలపించడం కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నిన్నా మొన్నటి వరకు ఒకరి పట్ల మరొకరు చిటపటలాడిన నేతలు అకస్మాత్తుగా ఆకాశానికెత్తుకునే రేంజ్‌లో పొగడ్తలతో ముంచెత్తుకోవడం పార్టీ శ్రేణులతో పాటు ప్రత్యర్థులను అవాక్కయ్యేలా చేసింది.

ముఖ్యంగా ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం పార్టీలో చర్చగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల అనంతరం ఆయన వ్యవహార శైలిపై అనుమానాలు రెట్టింపు అయ్యాయి. ఆయన తరచూ కేంద్ర పెద్దలతో భేటీ కావడంతో పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఆ ప్రచారన్ని ఖండిస్తూ వస్తున్న కోమటిరెడ్డి తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన మంచిర్యాల సభ సమయంలో కోమటిరెడ్డి దళిత సీఎం కాన్సెప్ట్‌ను తెరమీదకు తీసుకురావడం వెనుక రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే వ్యూహం అనే చర్చ జరిగింది. కానీ తాజాగా నల్గొండ నిరుద్యోగ నిరసన దీక్షలో మాత్రం సీన్ మారిపోయింది. రేవంత్ రెడ్డిపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక రేవంత్ రెడ్డి సైతం కోమటిరెడ్డిని మిత్రుడు, ఆప్తుడు అంటూ ఆకాశానికి ఎత్తడం సభలో హైలెట్‌గా మారింది.

అయితే, ఎన్నికల ఏడాది కావడం, ప్రజాక్షేత్రంలో పోరాటాలపై దృష్టి సారించాల్సిన నేతలు గత కొంతకాలంగా పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పార్టీకి నష్టం కలుగుతుందనే విమర్శలు వినిపిస్తున్న వేళ నల్గొండ జిల్లా వేదికగా నేతలు ఐక్యతను చాటిచెప్పే ప్రయత్నం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కాగా, గతంలోనూ ఇలాంటి కలిసిపోయే సన్నివేశాలు చోటు చేసుకున్నా.. ఆ తరువాత జరిగిన పరిణామాలతో నేతల మధ్య సఖ్యత కొరవడిందనే టాక్ వినిపించింది.

తాజాగా ఓ వైపు బీఆర్ఎస్, బీజేపీ రాబోయే ఎన్నికల కోసం స్పీడ్ పెంచుతున్న తరుణంలో జానారెడ్డి లాంటి సీనియర్ల సమక్షంలో కోమటిరెడ్డి లాంటి ముఖ్యనేత రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడటం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది. పరస్పరం నేతలు ఆలింగనాలతో తామంతా ఒక్కటే అని చెప్పే ప్రయత్నం మీటింగ్‌లో కొత్త జోష్ నింపింది. దీంతో నేతలంతా సమిష్టిగా ఉంటే పార్టీకి విజయం ఖాయం అనే చర్చ జరుగుతున్నది. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో తిరిగి యాక్టీవ్ అవుతుంటే పార్టీలోని మరి కొంతమంది సీనియర్లు అసంతృప్తితో ఉండటం చర్చనీయాంగా మారింది. దీంతో నల్గొండ జిల్లాలో ఏర్పడిన ఈ కలయిక కలకాలం నిలిచేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed