నిరీక్షణలో ఐదు సంవత్సరాలు.. మోక్షం ఎప్పుడో మరి..

by Disha Web Desk 20 |
నిరీక్షణలో ఐదు సంవత్సరాలు.. మోక్షం ఎప్పుడో మరి..
X

దిశ, చెన్నూర్ : త్యాగాదుల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో మరొక అడుగు ముందుకు వేసి బంగారు తెలంగాణ సాధించే దిశలో పయనిస్తున్నామని చెప్పుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు. కానీ గత ఐదు సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం, కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయకపోవడం పట్ల పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గుంజుకోవడానికి కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని అధికార పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారే తప్ప గత ఐదుసంవత్సరాల నుండి ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోకపోవడం అధికార పార్టీ నాయకులకు ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాలు అర్థమవుతున్నాయని చెప్పవచ్చు.

గత కొన్ని సంవత్సరాల నుండి పెళ్లిళ్లు చేసుకుని వేరేకాపురాలు ఉంటున్న లక్షలాది మంది నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పవచ్చు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రికి గ్రానైట్ వ్యాపారంలో ఉన్న శ్రద్ధ పేద కుటుంబాల పై చూపడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు మంత్రి కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో అసెంబ్లీలో ప్రస్తావన తేలేదని ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించడం లేదని ఎన్నికల ముందు తూతూ మంత్రంగా కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేయిస్తామని వాగ్దానాలు చెప్పి తిరిగి ఓట్లు గుంజుకుని తిరిగి ప్రజలను మోసం చేస్తారని ప్రజలు లబోదిబోమంటున్నారు.

కొత్తగా జన్మించిన వారి పేర్లను కార్డులో నమోదు చేయకపోవడంతో వారి విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు శ్రద్ధ వహించి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడంతో పాటు కొత్త పేర్లను నమోదు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. బడా వ్యాపారస్తులకు రేషన్ కార్డులు దరిద్ర రేఖకు దిగువన ఉన్న పేదకుటుంబాలని ఆదుకోవాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రేషన్ కార్డులను నిత్యం లక్షల రూపాయలు సంపాదించే బాడా వ్యాపారులకు చెన్నూరు పట్టణంలో రేషన్ కార్డులు మంజూరు చేశారని, అరుహులు కాని వారికి ఇచ్చిన కార్డులను రెవెన్యూ అధికారులు వెంటనే నిలిపివేసి నిజమైన పేద కుటుంబాలను గుర్తించి రేషన్ కార్డులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Next Story