రీ కాల్ చట్టం కోసమే ఉద్యమం : Teenmar Mallanna

by Disha Web Desk 20 |
రీ కాల్ చట్టం కోసమే ఉద్యమం : Teenmar Mallanna
X

దిశ, బెల్లంపల్లి : ఓట్లు వేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న ప్రజలకు అవినీతి అక్రమాలకు పాల్పడే ప్రజాప్రతినిధులను రీ కాల్ చేసే చట్టo అవసరమని తీన్మార్ మల్లన్న అన్నారు. సోమవారం బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 7200 మంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు అక్రమార్కులుగా గుర్తించినట్లు తెలిపారు. రీ కాల్ చట్టాన్ని తీసుకురావడం వల్ల ఎన్నికైన ప్రజాప్రతి నిధులు అవినీతికి పాల్పడడానికి భయపడతారని వివరించారు. దేశంలో రీకాల్ చట్టం తీసుకురావడం కోసం తనవంతుగా పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలకు అంతులేకుండా పోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రకటిస్తున్న పథకాలన్నీ కూడా రాబోయే ఎన్నికల కోసమేనని పేర్కొన్నారు. దళిత బంధు, గిరిజన బంధు, రైతుబంధు తదితర పథకాలన్నీ ఎన్నికల అనంతరం రద్దవుతాయని తెలిపారు. రాష్ట్రాన్ని లూటీ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లను కూడబెట్టుకుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. నిరుద్యోగులకు భృతి, ఉద్యోగ అవకాశాలు, పేదలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎన్నికల్లో హామీలు ఇచ్చి పూర్తిగా విస్మరించారన్నారు. ఇప్పుడేమో సొంతింటి జాగా ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. లక్షలు ఇస్తామని ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలను మార్చడంలో కేసీఆర్ ను మించిన ఘనుడు లేడన్నారు. విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నాడని విమర్శించారు. డెవలప్మెంట్ చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల నుంచి రూ. ఆరువేల కోట్లు వసూలు చేస్తున్నాడని మండి పడ్డారు. ఉచిత కరెంటు అడ్రస్ లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానని ప్రగల్బాలు పలికిన సీఎం ఆచరణలో విఫలమయ్యాడని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చి, ప్రతి ఒక్కరిపై రూ 1.25 లక్షల అప్పులు మిగిల్చాడని వివరించారు.

రీకాల్ పద్ధతి వస్తేనే కేసీఆర్ అవినీతి పాలన అంతమవుతుందన్నారు. ఇందుకోసం ప్రజలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రజల వద్దకు వెళితే అడ్డుకుంటారన్నారు. పోలీసులను మోహరించి ప్రజా సమస్యలు తెలుసుకోకుండా ఆటంకాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా తీన్మార్ మల్లన్న గొంతు నొక్కడం ఎవరికి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యు లు సుదర్శన్, దాసరి భూమయ్య, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Next Story